నవతెలంగాణ-హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఫోన్లు ట్యాపింగ్కు గురైన నేతలను వరుసగా విచారణకు పిలిచి వారిచ్చే స్టేట్మెంట్లను రికార్డు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్కు గురైందని గుర్తించారు. దీంతో ఆయనను సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని కోరారు. అధికారు అభ్యర్థన మేరకు ఇవాళ ఆయన ఉదయం 10.30కి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చి సిట్ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ తతంగమంతా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని అన్నారు. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ఆడియోలను కేసీఆర్తో పాటు సంతోష్ రావులకు ఇచ్చారని తెలిపారు. నాడు ఓటుకు నోటు అంశం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వెలుగులోకి వచ్చిందని కామెంట్ చేశారు. అదేవిధంగా సొంత పార్టీ నేతలు ఎమ్మెల్సీ కవిత , పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు ఫోన్లకు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని పెద్ద పెద్ద బిజినెస్మెన్లు, సినిమా వాళ్ల ఫోన్లను కూడా వదిలిపెట్టలేదని అన్నారు. ఎలాగైనా హ్యట్రిక్ విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేశారని ఫైర్ అయ్యారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఫోన్ ట్యాపింగ్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ జరిపించాలని గోనె ప్రకాశ్ రావు డిమాండ్ చేశారు.