– తమ హక్కులను రక్షించాలి : ట్రాన్స్జెండర్, ఇంటర్సెక్స్, జెండర్ నాన్కన్ఫార్మింగ్, క్వీర్ వర్గాల ప్రతినిధుల డిమాండ్
– ఇందిరాపార్కు వద్ద ధర్నా
నవతెలంగాణ – ముషీరాబాద్
ట్రాన్స్జెండర్ హక్కుల పరిరక్షణ సవరణ బిల్లు 2026ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని ట్రాన్స్జెండర్, ఇంటర్ సెక్స్, జెండర్ నాన్కన్ఫార్మింగ్, క్వీర్ వర్గాల ప్రతినిధితులు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ మార్చి 13న లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ట్రాన్స్ జెండర్స్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్ స్వేచ్ఛ మాట్లాడుతూ.. దశాబ్దానికి పైగా కృషి చేసి సాధించుకున్న చట్టపరమైన రక్షణలను ఈ బిల్లు వెనక్కి తీసుకెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న వ్యతిరేక స్వరాలకు హైదరాబాద్ సమాజం కూడా మద్దతు తెలుపుతోందన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న స్వీయ గుర్తింపు హక్కును ఈ సవరణ బిల్లు తొలగించి, జిల్లా వైద్య అధికారుల ద్వారా తప్పనిసరి ధ్రువీకరణ విధానాన్ని ప్రతిపాది స్తోందని తెలిపారు.
ఈ ప్రక్రియలో పారదర్శకత, ప్రమాణాలు, జవాబుదారీతనం లేవని విమర్శిం చారు. ట్రాన్స్జెండర్ కాళీ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణకు శాస్త్రీయంగా స్పష్టమైన ప్రమాణాలు లేనప్పటికీ వ్యక్తులను వైద్య పరీక్షలకు గురిచేయడం మానసికం గా హానికరమన్నారు. చట్టపరమైన గుర్తింపునకు శస్త్రచికిత్సను ఆధారంగా చేసుకోవడం మానవ హక్కులకు విరుద్ధమని చెప్పారు. శస్త్రచికిత్స వివరాలను జిల్లా మేజిస్ట్రేట్కు తెలియజేయాలనే నిబంధన గోప్యత హక్కును ఉల్లంఘిస్తోందన్నారు. బిల్లులో ట్రాన్స్జెండర్ నిర్వచనాన్ని పరిమితం చేయడం వల్ల ట్రాన్స్ పురుషులు, నాన్-బైనరీ, జెండర్ క్వీర్ వ్యక్తులు గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇంటర్సెక్స్ వ్యక్తులను ట్రాన్స్జెండర్ వర్గంతో కలిపివేయడం వల్ల వారి ప్రత్యేక హక్కుల సమస్యలు పక్కనపడే అవకాశం ఉందని తెలిపారు. ఈ సవరణ బిల్లును పూర్తిగా ఉపసంహరించు కోవాలని, ట్రాన్స్జెండర్ సహా లింగ వైవిధ్య వర్గాల హక్కులను పరిరక్షించేలా చట్టాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ట్రాన్స్జెండ ర్లు లిల్లీ, నిత్య, నీతి, భారీ సంఖ్యలో ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు.
‘ట్రాన్స్జెండర్’ బిల్లును ఉపసంహరించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



