దలాల్ స్ట్రీట్కు దడ.. రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి
సెన్సెక్స్ 2500 పాయింట్ల పతనం
ఇన్వెస్టర్ల బెంబేలు
ముంబయి : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాద చర్యలు దలాల్ స్ట్రీట్ను తీవ్ర కల్లోలానికి గురి చేస్తున్నాయి. పశ్చిమాసియాలో ట్రంప్ ఇజ్రాయిల్ను ఎగదోసి ఇరాన్పై కొనసాగిస్తోన్న దాష్టికం ఇన్వెస్టర్ల పాలిట శాపంగా మారింది. యుద్ధ భయంతో అంతర్జాతీయ మార్కెట్ల పతనం, పెరుగుతున్న ద్రవ్యోల్బణ భయాలు భారత మార్కెట్లను పాతాళానికి నెట్టేస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరి కావడంతో మదుపర్లు వరుస నష్టాలను చవి చూస్తోన్నారు.
ఈ క్రమంలోనే గురువారం సెన్సెక్స్, నిఫ్టీలను యుద్ధ జ్వాలలు దహించివేశాయి. గురువారం ఒక్కరోజే సెన్సెక్స్ 2,400 పాయింట్లు కుప్పకూలడంతో ఇన్వెస్టర్ల కష్టార్జితం రూ.12 లక్షల కోట్లు తుడుచుకు పెట్టుకుపోయింది. ఇరాన్ చమురు నిక్షేపాలపై దాడుల వార్తలతో ముడి చమురు ధరలు బ్యారెల్కు 111 డాలర్లకు చేరడం మార్కెట్లను బెంబేతెల్తించాయి. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై మొండిచేయి చూపడంతో ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే తీవ్ర అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 2500 పాయింట్లు పతనమై 74,207కు క్షీణించింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 776 పాయింట్లు కోల్పోయి 23,002 వద్ద ముగిసింది. బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11.5 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.427 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. 2024 సాధారణ ఎన్నికల్లో బిజెపికి కేవలం 272 సీట్లు మాత్రమే రావడంతో మార్కెట్లు 6 శాతం నష్టపోయాయి. ఆ తర్వాత అత్యధిక భారీ నష్టం జరగడం ఇదే తొలిసారి. సెన్సెక్స్-30లో ఒక్క సూచీల కూడా లాభపడలేదు. ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్అండ్టీ సూచీలు అధిక నష్టాలను చవి చూశాయి.



