గాజా యుద్ధ బాధితులను రక్షించడంలో విఫలమైంది : లూలా ఆగ్రహం
కౌలాలంపూర్ : బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా ఆదివారం ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలపై నిప్పులు చెరిగారు. అవి పని చేయడం ఆపేశాయని, గాజా యుద్ధ బాధితులను రక్షించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో సమావేశమైన అనంతరం లూలా విలేకరులతో మాట్లాడుతూ గాజా స్ట్రిప్లో చాలా కాలంగా కొనసాగుతున్న మారణహోమాన్ని ఎవరు అంగీకరిస్తారని ప్రశ్నించారు.
ఇలాంటివి జరగకుండా అడ్డుకోవడానికి అంతర్జాతీయ సంస్థలను ఏర్పాటు చేశారని, కానీ అవి ఇప్పుడు పని చేయడం లేదని చెప్పారు. ఇవాళ ఐరాస భద్రతా మండలి, ఐరాస అచేతనంగా ఉండిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై కూడా లూలా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘ఒక నాయకు డికి నోబెల్ బహుమతి కంటే తల పైకెత్తి నడవడం చాలా ముఖ్యం’ అని ఎద్దేవా చేశారు. కాగా గాజాపై వైఖరి విషయంలో ఇజ్రాయిల్, బ్రెజిల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయం లో లూలా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.



