తాజా కాల్పుల్లో తొమ్మిది మంది మృతి
గాజా : గాజాలో నరమేధం ఆగలేదు. మంగళవారం మళ్ళీ ఇజ్రాయిల్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో కాల్పుల విరమణ తొలి దశలో భాగంగా సోమవారం బందీలు, పాలస్తీనా ఖైదీల విడుదల జరిగిన నేపథ్యంలో ఇక గాజాలో శాంతి నెలకొన్నట్లేనని ట్రంప్ గాజా సదస్సులో ప్రకటించారు. అది జరిగి 24గంటలు కూడా గడవకముందే మళ్ళీ కాల్పులు చోటుచేసుకున్నాయి. 28ఏళ్ళ పాలస్తీనా జర్నలిస్టు సలేV్ా అల్జాఫరావిని సైనిక బలగాలు కాల్చి చంపాయి. గాజాలోని షుజయెవ ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.
శిథిలాల్లో నుంచి 38 మృతదేహాలు
గత 24గంటల్లో 44 మృతదేహాలను ఆస్పత్రికి తీసుకు వచ్చినట్టు గాజా ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అలాగే 29మంది గాయపడ్డారని కూడా వెల్లడిం చాయి. 38 మృతదేహాలను శిధిలాల దిబ్బల్లోంచి తొలగించారని ఆ వర్గాలు తెలిపాయి. ఇంకా అనేకమంది బాధితులు ఆ శిధిలాల్లో చిక్కుకుని వున్నారని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో గాజా మృతులు 67,913కి చేరాయి. అలాగే ఇజ్రాయిల్ నుంచి 45మంది పాలస్తీనా ఖైదీల మృతదేహాలు కూడా తమకు అందాయని రెడ్క్రాస్ తెలిపింది. వారి మృతికి గల కారణాలను కనుగొనేందుకు పరీక్షలు చేయాల్సి వుంది.
సాధికారతపైనే శాంతి
గాజాను పాలించడానికి పాలస్తీనియన్లకు కల్పించే సాధికారతపైనే శాంతి ఆధారపడి వుంటుందని పాలస్తీనా ప్రధాని మహ్మద్ ముస్తఫా వ్యాఖ్యానించారు. దాడులు ఒక్కటి ఆపేస్తే ఈ విషాదం ముగియదని ఆయన పేర్కొన్నారు. గాజాను పాలించుకునేందుకు పాలస్తీనా ప్రభుత్వానికి పూర్తి సాధికారతను కల్పించినపుడు మాత్రమే శాంతి సుస్థిరతలు నెలకొంటాయని ఆయన స్పష్టం చేశారు.