ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎస్ రామకృష్ణారావు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వన మహోత్సవం కార్యక్రమం విజయవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే. రామ కృష్ణా రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సిఎస్ కే రామ కృష్ణా రావు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ హనుమంత రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వన మహోత్సవం కార్యక్రమం, ఇందిరమ్మ ఇండ్ల, ఎరువుల లభ్యత, ఆయిల్ పామ్ పంట విస్తరణ, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం వంటి పలు అంశాల పై సీఎస్ సుదీర్ఘంగా చర్చించి పలు సూచనలు చేశారు.
రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే రామ కృష్ణా రావు మాట్లాడుతూ, 2 లక్షల 30 వేల కు పైగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశామని, లక్షకు పైగా ఇండ్ల నిర్మాణ పనులు గ్రౌండ్ అయ్యాయని అన్నారు. పెద్ద వర్షాలు కురవడానికి ముందే మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్, బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం జరిగేలా చూడాలని సీఎస్ సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తూ సీనరేజి చార్జిలను ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ పనులు లబ్ధిదారులు పూర్తి చేసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. ప్రస్తుతం ఎంత మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరిగిందో ఎంబీ రికార్డులను నమోదు చేసి లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించాలని, ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుందని అన్నారు.
పిఎం ఆవాస్ యోజన అర్భన్ 2.0 క్రింద మనకు లక్షా 13 వేల ఇండ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, ప్రతి పట్టణం నుంచి కనీసం 500 మంది నిరు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ లకు సీఎస్ సూచించారు. వన మహోత్సవం కార్యక్రమం క్రింద ఇండ్లకు పంపిణీ చేసే మొక్కల పెంపకం సైతం పరిశీలించాలని, మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎస్ కలెక్టర్ లకు సూచించారు. ప్రతి జిల్లా ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేసుకుని వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలని, నాటిన మొక్కల వివరాలను ఎప్పటికప్పుడు జియో కో-ఆర్డినేట్స్ తో ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు.
ప్రతి జిల్లాలో ఎరువుల లభ్యత స్టాక్ పై రివ్యూ పెట్టాలని అన్నారు. జూలై వరకు అవసరమైన స్టాక్ ప్రస్తుతం అందుబాటులో ఉందని, సెప్టెంబర్ నాటికి అవసరమైన ఎరువుల స్టాక్ ప్రోక్యూర్ చేస్తున్నామని అన్నారు. ఎరువుల స్టాక్ ను ప్రత్యేక అధికారులను నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. రిటైల్ విక్రయాలను డిజిటలైజ్ చేయాలని కలెక్టర్ లకు సీఎస్ సూచించారు. వ్యవసాయ సహకార సంఘాలు, ఎరువుల షాప్ వద్ద ఎక్కడ కొరత రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.
లక్షా 25 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ పంట సాగు ప్రస్తుత సంవత్సరం విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. రైతులకు లాభసాటి పంట ఆయిల్ పామ్ పట్ల అవగాహన కల్పిస్తూ పంట విస్తరణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సుల ద్వారా దాదాపు 8 లక్షల 27 వేల దరఖాస్తులు వచ్చాయని, వీటిని సాధా బైనామా, ఆర్ఓఆర్ సమస్యలు, పట్టాలో కరెక్షన్స్ వంటి వివిధ సమస్యల పై దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఆగస్టు 15 నాటికి ఈ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
డెంగ్యూ, మల్లేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు జిల్లాల్లో పటిష్ట చర్యలు తీసుకోవాలని, కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించి సీజనల్ వ్యాధుల నియంత్రణ పై అవగాహన కల్పన, పర్యవేక్షణ వంటి పలు కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వల్నరబుల్ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి లక్షణాలు గల ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ జరిగిన వారికి అవసరమైన చికిత్స అందించాలని అన్నారు.
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ మాట్లాడుతూ, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. ప్రజల్లో వన మహోత్సవం కార్యక్రమం తీసుకుని వెళ్ళాలని, ప్రతి రోజూ ఒక్కో శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వసించాలని అన్నారు. జిల్లాలో వి.ఐ.పి పర్యటనల సందర్భంగా తప్పనిసరిగా మొక్కలు నాటేలా చూడాలని అన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ పరిధిలో ఎత్తైన మొక్కలు నాటి వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో ఇందిరమ్మ ఇండ్లు, వన మహోత్సవం , సీజనల్ వ్యాధులు, ఆయిల్ ఫామ్ ఎరువులు, భూ భారతి వంటి అంశాల పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేసేలా ప్రోత్సహించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను కోరారు.
వన మహోత్సవం లో బాగంగా వాన కాలం మొదలైనందున మొక్కలు పెద్ద ఎత్తున నాటాలని తెలిపారు. మొక్కలు నాటడానికి అనువైన ప్రదేశాన్ని చూసి మొక్కల్ని నాటాలని అన్నారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు రైతాంగాన్ని ప్రోత్సహించాలని ఆయిల్ ఫామ్ సాగు కొరకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులకు లాభ సాటి పంట ఆయిల్ ఫామ్ పట్ల అవగాహన కల్పిస్తూ పంట విస్తరణ జరిగేలా చూడాలన్నారు. భూ భారతి ద్వారా స్వీకరించిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రణాళిక బద్దంగా వెళ్లాలన్నారు.ప్రతి దరఖాస్తు క్షుణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు.
క్షయ వ్యాధి నిర్మూలన కోసం ప్రభుత్వం టీ.బీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల పరిధిలో టీబీ నియంత్రణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు ఫాగింగ్ ఆయిల్ బాల్స్ అందుబాటులో ఉంచాలన్నారు.గ్రామాలలో ప్రతి ఫ్రై డే ను – డ్రై డే గా తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ జడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.