నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఎన్నికలలో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలన జరపాలని జిల్లా స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. బుధవారం మినీ మీటింగ్ హల్ లో ఎన్నికల సంఘం నిబంధనలు తుచా తప్పకుండా పాటిస్తూ జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో పోలింగ్ సరళిని సూక్ష్మ స్థాయిలో పరిశీలన జరిపేందుకు వీలుగా నియమించబడిన మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ కు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలని, అప్పుడే పోలింగ్ తీరుతెన్నులను నిశితంగా పరిశీలిండం జరుగుతుందని అన్నారు.
ముఖ్యంగా పోలింగ్ కు ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు చేరుకొని పోలింగ్ సిబ్బందికి అందించే సామాగ్రి సక్రమంగా అందినదా లేదా అన్నది పరిశీలించాలని, అనంతరం పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా మాక్ పోలింగ్ నిర్వహించారా లేదా అన్నది పరిశీలించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయా అని చూసుకోవాలన్నారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి పూర్తయ్యేంత వరకు అన్ని అంశాలను గమనిస్తూ, ఎప్పటికప్పుడు వాటిని జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. శిక్షణ తరగతుల్లో సూచించిన అంశాలను చక్కగా అవగాహన చేసుకుని సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. ఈ శిక్షణ తరగతుల లో మాస్టర్ ట్రైనర్లు నర్సిరెడ్డి, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.



