Tuesday, June 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవికలాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

వికలాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -

– బెంచ్‌ మార్కు వైకల్యమున్నా ఉచిత పరికరాలకు అర్హులే..
– రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలకోసం ప్రభుత్వం కృషి : తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మెన్‌ ముత్తినేని వీరయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

వికలాంగులకు నిత్య జీవితంలో ఉపయోగపడే వివిధ సహాయ ఉపకరణాలు అందించేందుకు ఇటీవల ప్రభుత్వం జీవో నెంబర్‌ 89 విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 40శాతం, అంతకన్నా ఎక్కువ వైకల్యమున్న వికలాంగులు వివిధ రకాల ఉపకరణాలు పొందేందుకు అర్హులని స్పష్టం చేసింది. ఆ మేరకు నిబంధనలు సడలించటంతో రాష్ట్రంలో వివిధ వైకల్యాలతో బాధపడే వారికి లబ్ది చేకూరనుంది. గతంలో 75శాతానికి పైగా వైకల్యం ఉంటేనే అర్హులుగా ఉండే వారు. దాంతో చాలా మంది వికలాంగులు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే ఉపకరణాలు, ఇతర సంక్షేమ ఫలాలకు దూరంగా ఉండే వారని తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మెన్‌ ముత్తినేని విరయ్య తెలిపారు. ఆయనతో నవతెలంగాణ ముఖా ముఖి…
బెంచ్‌మార్కు వైకల్యం ఉన్న వారు ఉచిత పరికరాలకు అర్హులేనా?
నూటికి నూరు శాతం వారికి ఉచిత పరికరాలు అందుతాయి. బెంచ్‌మార్కు వైకల్యం(40శాతం) ఆ పైన ఉన్న వారికి ఉచిత పరికరాలు అందించాలని ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. వికలాంగుల హక్కుల చట్టం -2 016 లో ఈ అంశం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ.. గత పదేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కానీ ఆ దిశగా అడుగులు వేయలేదు. కేంద్రానికి అనుబంధ వ్యవస్థ అయిన అలింకో సంస్థ కూడా 80శాతానికి లోపు ఉంటే ఏ సహాయ ఉపకరణం వికలాంగులకి ఇవ్వడం లేదు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ అంశాన్ని పట్టించుకున్న పాపాన పోవటం లేదు. కేంద్రం తో పాటు మిగిలిన అన్ని రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని జీవోలివ్వాలి
జీవో 89 ద్వారా వికలాంగులకు చేకూరే ప్రయోజనమేంటి?
ఈ జీవో వికలాంగులకు అత్యంత ప్రయోజనకరంగా నిలుస్తుంది. 40శాతం వైకల్యం ఉన్నవారికి కూడా మోటరైజ్డ్‌ వాహనాలు, వికలాంగుల బ్యాటరీ వీల్‌ చైర్‌లు, కూడా 40శాతం వైకల్యం ఉన్న స్పైనల్‌ కార్డ్‌ ఇంజురీ, మస్కులర్‌ డిస్ట్రోపీ గల వారికి అందించే విధంగా జీవోను రూపొందించాం. గత ప్రభుత్వం 90శాతం వైకల్యం ఉంటేనే అర్హులుగా పరిగణలోకి తీసుకున్నారనేది గమనార్హం. లాప్‌టాప్‌లను ఆర్థోపెడికల్‌ వికలాంగులకు ఇకపై ప్రొఫెషనల్‌ కోర్సుల్లో డిగ్రీ, ఆ పై (జనరల్‌ కోర్సులు) చదువుతున్న వారికి అందించాలని జీవో చెబుతున్నది. అంధ వికలాంగులకు 50శాతం, వినికిడి లోపం ఉన్న వికలాంగులకు 51శాతం, ఆ పైన ఉన్న వారికి లాప్‌ టాప్‌ లు ఇచ్చే విధంగా జీవో తీసుకొచ్చాం. ఎస్సీ, ఎస్టీ, మహిళా వికలాంగులకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించింది. కుర్చీ కే పరిమిత మైన వికలాంగుల కోసం ఇన్నోవేటివ్‌ బ్యాటరీ విల్‌ చైర్లను అందించ బోతున్నాం. వికలాంగులు స్వయం ఉపాధి పొందేలా 50 రకాల వ్యాపారాలు చేసుకునే వీలు కల్పిస్తూ బిజినెస్‌ బ్యాటరీ వెహికల్స్‌ అందించ బోతున్నాం. ఈ విధంగా అన్ని రకాల వైకల్యం కలిగిన వికలాంగులకు జీవోద్వారా పరికరాలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉన్నది. ఇది ఎన్నో ఏండ్ల కల. సీఎం రేవంత్‌రెడ్డి దీన్ని సాకారం చేశారు.
ఇటీవల కాలంలో వికలాంగులపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు చర్యలు?
నిజమే..వికలాంగులపై అరాచకాలు, దాడుల నివారణకు ఉన్న చట్టాలను ఉపయోగించి కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్‌ యువవికాసం తదితర సంక్షేమ పథకాల్లో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్‌ అమలుకు కృషి చేస్తున్నది. ఉద్యోగ నియమాకాల్లో రిజర్వేషన్‌ కల్పించింది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వికలాంగులకు సహకార సంస్థ నుంచి ఉచిత కోచింగ్‌తో పాటు మెటేరియల్‌ను అందించింది. రాష్ట్రంలో భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో వికలాంగులకు అవకాశం కల్పిస్తున్నది. ఎప్పటి నుంచో నిర్లక్ష్యానికి గురవుతున్న బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ చేసింది. అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల పీఆర్‌సీ సమస్యను పరిష్కరించుకున్నాం.
వికలాంగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఎంత వరకు వచ్చింది?
వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. వికలాంగులకు పెద్దన్నగా సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో 21 రకాల వైకల్యాల ప్రకారం సుమారు 43.04 లక్షల మంది వికలాంగులున్నారు. వారికి సమాన అవకాశాలు, హక్కులు కల్పించి సమాజాభివృద్ధిలో భాగం చేయాలనే తలంపుతో ఆయనున్నారు. జీవో 89 ద్వారా ఉచితంగా సహాయ ఉపకరణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలను ప్రకటించింది. అందుకు తగిన విధంగా రాష్ట్రంలో దరఖాస్తుల వెల్లువ కొనసాగుతున్నది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పదేండ్ల కాలంలో రూ. 64 కోట్లు కేటాయిస్తే..రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వం 2024-25, 2025-26 సంవత్సరాలకు రూ.100కోట్లు కేటాయించి ఖర్చు చేస్తున్నది.
వికలాంగులను దివ్యాంగులుగా నామకరణం చేసిన మోడీ.. వారి సంక్షేమం కోసం చేస్తున్నదేమిటి?
మోడీ ప్రభుత్వం వికలాంగులకు బదులు దివ్యాంగులుగా పేరు మార్చి గొప్పలు చెప్పుకోవటం తప్ప వారి సంక్షేమం కోసం ఏ విధంగానూ కృషి చేయటంలేదు. కేంద్రం నుంచి వికలాంగులకు రావాల్సిన నిధులు కూడా సకాలంలో ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో వికలాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదు. జాతీయ వికలాంగుల కమిషన్‌ ఊసే లేదు. వికలాంగుల సంక్షేమం విషయంలో కేంద్రం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తి శ్రద్ధ తీసుకుంటు న్నది. వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి చిత్తశుద్దితో ఉన్నారు. ప్రపంచ జనాభాలో 100 కోట్లకు పైగా వికలాంగులుంటారని ఐక్యరాజ్య సమితి అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో సుమారు 2.68 కోట్ల మంది ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్నారు. వీరిలో 1.5 కోట్ల మంది పురుషులు 1.18 కోట్ల మంది మహిళలున్నారు. రాజ్యాంగంలోని 41వ ఆర్టికల్‌లో అంగవైకల్యం, ఇతర అవాంఛనీయ సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంక్షేమ కోసం నిర్దిష్ట ప్రణాళికలను రూపొందించాలని ఆదేశిక సూత్రాల్లో ఉన్నది. దేశంలో వికలాంగుల సంక్షేమం కోసం మొదటిసారిగా 1995లో చట్టం చేశారు.
ఈ చట్టం గుర్తించిన వైకల్యాలు ఏడు మాత్రమే. కానీ వికలాంగుల హక్కుల గుర్తింపు దిశగా ఇది ఓ మైలు రాయిగా చెప్పొచ్చు. కొన్ని సవరణలు చేస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం కొత్త వికలాంగుల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీనిలో 21 రకాల వైకల్యాలు చట్టపరమైన గుర్తింపును పొందాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయడం లేదు. ఆ చట్టాలు కాగితాలకే పరిమితమయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -