ప్రపంచ మానవాళి, సమస్త జీవరాశి మనుగడను అడుగడుగునా భయపెడుతున్న అతిపెద్ద సమస్య పర్యావరణ విధ్వంసం. ఆర్ధిక ప్రగతి, అభివృద్ధి పేరుతో మానవుడు చేపడుతున్న వినాశకర చర్యల వల్ల వెదజల్లబడుతున్న కలుషితాలు పర్యావరణాన్ని తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతీస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, జల కాలుష్యం, లోకమంతా విస్తరిస్తున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు, గతి తప్పిన ఋతుచక్రం, ధ్వంసమవుతున్న జీవ వైవిధ్యం మొత్తానికి మొత్తంగా అతిపెద్ద పర్యావరణ సంక్షుభిత కాలంలో మనమీ ప్రపంచ పర్యావరణ దినోత్సం జరుపుకోబోతున్నాం.
(ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కొందాం అనే ఈ ఏడాది థీమ్ నినాదంతో 2025 పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలు)
(జూన్ 5 పర్యావరణ దినోత్సవం సందర్బంగా)
1972లో స్వీడన్లో పర్యారణంపై జరిగిన అంతర్జాతీయ సదస్సు ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఆరోగ్యం, పర్యావరణం అనే అంశంపై విస్తృతంగా చర్చింది. మానవాళితో పాటు సమస్త జీవరాశి మనుగడలో ఎంతో కీలకమైన భూమికను పోషించే పర్యావరణాన్ని కాలుష్యం బారి నుండి కాపాడడానికి ప్రపంచ దేశాలను సమాయత్తం చేయడానికి ఐక్యరాజ్యసమితి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యుఎన్ఇపి) అనే సంస్ధని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1973 నుండి యుఎన్ఇపి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జూన్ 5వ తేదిన ప్రపంచ దేశాలన్నీ పర్యావరణ దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కొందాం (బీట్ ది ప్లాస్టిక్ పొల్యుషన్) అనే నినాదంతో 2025లో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవాలని యుఎన్ఇపి ప్రపంచ దేశాలను కోరింది. ఈ సందర్భంగా 21వ శతాబ్దంలో మానవాళితో పాటు సమస్త జీవరాశి మనుగడకు ప్రధానమైన అడ్డంకులలో ఒకటిగా భావిస్తున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చింది. 2025 పర్యావరణ దినోత్సవాన్ని యుఎన్ఇపి తరుపున కొరియా రిపబ్లిక్ నిర్వహిస్తుంది. ప్లాస్టిక్ వ్యర్ధాలను అరికట్టడానికి ప్రపంచదేశాలు చిత్తశుద్ధితో కృషి చేయకపోతే జీవరాశి మనుగడకు కారణమయిన సహాజ వనరులన్నీ కలుషితమయ్యే ప్రమాదముందని యుఎన్ఇపి హెచ్చరిస్తుంది. అమెరికా వంటి అగ్రదేశాలు ప్యారీస్ ఒప్పందం నుండి వైదొలగటంతో పాటు, ప్లాస్టిక్ కాలుష్య నివారణ కోసం జరుగుతున్న ప్రయత్నాలలో పాలు పంచుకోకపోవటం పరిస్థితిని మరింత దిగజారుస్తుంది.
జగమంతా విస్తరించింది
‘ఇందు కలదు, అందు లేదను సందేహాంబు వలదు ఎందెందు వెతికినా అందందే కలదు’ అన్న చందంగా ప్లాస్టిక్ నేడు జగమంతా విస్తరించింది. మానవుడు సైతం చేరలేని దుర్భేధ్యమైన ప్రాంతాలకు కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలు చేరుకున్నాయంటే, అవి ఎంత వేగంగా పర్యావరణ వ్యవస్థల్ని కబళిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. పునర్వినియోగం చేయలేని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుండి వెలువడుతున్న వ్యర్ధాలు భూమి మీద పెద్దయెత్తున్న పేరుకుపోతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల కన్నా అభివృద్ధి చెందుతున్న దేశాలైన ఆసియా, ఆఫ్రికన్ వంటి దేశాలలోనే ప్లాస్టిక్ వ్యర్ధాల కాలుష్యం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 430 మిలియన్ టన్నుల కన్నా ఎక్కువగా ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంటే, దానిలో సగం అంటే సుమారు 230 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలుగా పర్యావరణంలోకి నేరుగా విడుదలవుతున్నాయి. ఈ వ్యర్ధాలలో సింహభాగం ఒకసారి వాడి పారేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్ధాలే కావటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఏటా విడుదలవుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలలో 46శాతం వ్యర్ధాలు భూమిని కలుషితం చేస్తుంటే, 19 నుండి 23 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు జలాశయాల్లోకి విడుదల చేయబడుతున్నాయి. ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టు శిఖరం నుండి అతి లోతైన మెరియానా ట్రెంచ్ వరకూ ప్లాస్టిక్ వ్యర్ధాలు చేరుకున్నాయంటే ప్లాస్టిక్ వ్యర్ధాలు ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. దశాబ్దాలు, శతాబ్దాలు కాదు, సహాస్రాబ్దాలు కూడా క్షయం కాకుండా వాతావరణంలో కాలుష్యకాలను వెదజల్లే ప్లాస్టిక్ను నియంత్రించకపోతే పర్యావరణంతో పాటు, సమస్త జీవరాశి కూడా అనేక దుష్పరిణామాలను ఎదుర్కొవలసి ఉంటుంది.
ప్రపంచ దేశాల ఉదాసీనత…
చిలీ, న్యూజిలాండ్కు సగం దూరంలో ఉన్న పిట్కైర్న్ ద్వీప సముదాయంలో ఒకటైన అటోల్ హెండర్సన్ ద్వీపంలో శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ వ్యర్ధాలను కనుగొన్నారు. ఈ ద్వీప సముదాయాల్లో మనుషులెవరూ జీవంచరు. మానవుడు చేరుకోని ఎన్నో ప్రాంతాల్లోకి సైతం ప్లాస్టిక్ చొచ్చుకు పోయింది. దుర్భేద్యమైన, కఠినమైన శితోష్ణస్థితి పరిస్థితులున్న అర్కిటిక్ సముద్ర ప్రాంతాలలో కూడా పర్యావరణవేత్తలు ప్లాస్టిక్ వ్యర్ధాలను కనుగొన్నారు. సుమారు 17 రకాలకు పైగా మైక్రో ప్లాస్టిక్ వ్యర్ధాలను అర్కిటిక్ ప్రాంతాలలో శాస్త్రజ్ఞలు కనుగొన్నారు. భూమ్మీద స్ధిరంగా ఉండే ప్లాస్టిక్ వ్యర్ధాలు సముద్రాల్లోకి చేరి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయనటానికి ఇదొక ఉదాహారణ. ప్రపంచవ్యాప్తంగా 2021లో దాదాపుగా 390.7 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యిందని, ఏటా 14 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు సముద్ర జలాలను కలుషితం చేస్తున్నాయని యున్ఇపి అంచనా వేసింది. 2040 నాటికి 23 నుండి 37 మిలియన్ టన్నుల వ్యర్ధాలు మహాసముద్రాలలోకి ప్రవేశించవచ్చని, 2060 నాటికి 155 నుండి 265 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు విడుదలయ్యే అవకాశముందని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రపంచ పర్యావరణ వ్యవస్థలను పెద్దయెత్తున్న కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్ధాలను అరికట్టటంలో అన్ని దేశాలు ఉదాసీనంగానే వ్యవహారిస్తున్నాయి. భారతదేశంతో పాటు చైనా, ఇండోనేషియా, ఫిలిఫ్పీన్స్, థాయిలాండ్ వంటి దేశాలు ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్ధాలను శుద్ధి చేయకుండా సముద్రాల్లో నేరుగా పారబోస్తున్నాయని ఓషన్ కన్సర్వెన్సీ సంస్ధ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యర్ధాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్ర జలాలన్నీ కలుషితమై పోతున్నాయి. వలలు, ప్లాస్టిక్ తాడులు తిమింగలాలు, తాబేళ్ల వంటి సముద్రజీవులకు ఉరి తాళ్లుగా మారుతున్నాయని ఆ సంస్ధ ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం ఆర్ధిక భారాన్ని తప్పించుకోవడానికి పర్యావరణం, ప్రధానంగా జలావరణాలలో ఇంత పెద్దయెత్తున్న కాలుష్యాన్ని వెదజల్లటం సరి కాదని ఓషన్ కన్సర్వెన్సీ సంస్ధ తప్పుబడుతుంది. సముద్ర జలాలే కాదు, నదులు, సరస్సులు కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలతో నిండి పోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్ధాల వల్ల కలిగే కాలుష్యం వల్ల వేల కొద్దీ జలజీవులు అనారోగ్యం పాలై మృత్యువాత పడుతున్నాయి.
ప్రాణాలు తీస్తున్న ప్లాస్టిక్….
భూమి మీద నివశించే జీవుల కన్నా సముద్రంలో జీవించే జలచరాలే ప్లాస్టిక్ వ్యర్ధాల వల్ల ఎక్కువగా నష్టపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్ధాల వల్ల వెలజల్లబడే కాలుష్యం వల్ల మిలియన్ల కొద్దీ పక్షులు, చేపలు, ఇతర సముద్రజీవులు ఏటా పెద్దయెత్తున్న మృత్యువాత పడుతున్నాయి. సుమారు 800కి పైగా జీవజాతులు ప్లాస్టిక్ కాలుష్యం వల్ల అంతరించిపోయే దశకు చేరుకున్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ (ఐయుసిఎన్) సంస్ధ అంచనా వేసింది. ఉపరితల జీవులతో పాటు, లోతైన ప్రదేశాలలో నివశించే సముద్ర జీవుల శరీరాల్లో కూడా 80 శాతం జీవుల్లో ప్లాస్టిక్ సూక్ష్మరేణువులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రపంచ మహా సముద్రాలలో 170 ట్రిలియన్లకు పైగా ప్లాస్టిక్ కణాలు సముద్ర జలాల్లో తేలియాడుతున్నాయని ఐయుసిఎన్ తాజాగా గుర్తించింది. 100కి పైగా జాతులకు చెందిన జీవుల్లో మైక్రో ప్లాస్టిక్ కణాలు ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అరచేతిలో ఒదిగిపోయే చిన్న తాబేలు శరీరంలో సైతం సుమారు 140 మెక్రో ప్లాస్టిక్ ముక్కలను ఇటీవల జీవ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జీవుల్లో చేరిన మైక్రో ప్లాస్టిక్ కణాలు పెద్దయెత్తున్న విషతుల్యాలను విడుదల చేయటంతో పాటు జీవులలో జరిగే జీవన క్రియలకు ఆటంకం కలిగిస్తాయి. ఈ మైక్రో ప్లాస్టిక్ కణాలును గింజలుగా భావించి పక్షులు వాటిని ఆరగించటం వల్ల అవి వాటి జీర్ణాశయంలో చేరి వాటిలోని సకల వ్యవస్ధలను స్తంభింప చేయటంతో రోజుల వ్యవధిలోనే అవి మరణిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా రోజూ వేల సంఖ్యలో పక్షులు, జంతువులు ఈ మైక్రో ప్లాస్టిక్ వ్యర్ధాలు కలిగించే అనర్ధాల వల్ల చనిపోతున్నాయి. 90 శాతం సముద్ర పక్షుల శరీరాల్లో వాటి బరువుకి మించి మైక్రో ప్లాస్టిక్ కణాలున్నాయని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. సముద్రంలో జీవించే 86 శాతానికి పైగా వివిధ జాతులకు చెందిన తాబేళ్లు, 44 శాతం సముద్ర పక్షులు, 43 శాతం సముద్రంలో జీవించే క్షీరద జాతులు ప్లాస్టిక్ కాలుష్యం నుండి పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. సముద్రాలలో జీవించే చేపలను ఆహారంగా తీసుకునే తీరప్రాంత ప్రజలోకి ప్లాస్టిక్ వ్యర్ధాలు చేరి అనేక ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమవుతున్నాయి. సముద్రాల్లో జరిగే కాలుష్యంలో 80శాతం కాలుష్యం ప్లాస్టిక్ వ్యర్ధాల వల్లే కలుగుతుంది. 2050 నాటికి సముద్రాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్ధాల బరువు, సముద్రాల్లో ఉండే జలచరాల బరువు కన్నా రెట్టింపు ఉండే అవకాశముందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
భూతాపాన్ని పెంచటంలో కూడా కీలకమే…
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది, సుమారు 3 లక్షల 50 వేల కృత్రిమ రసాయనాలు విడుదలవుతుంటే వాటిలో 10 వేలకు పైగా రసాయనాలు ప్లాస్టిక్ కలుషిత ఉద్గారాలేనని పరిశోధకులు నిర్ధారించారు. భూమి, జల, వాయు కాలుష్యంతో పాటు భూమి ఉష్ణోగ్రతలు పెరగటంలో కూడా ప్లాస్టిక్ నుండి విడులయ్యే ఈ రసాయన ఉద్గారాలు గణనీయమైన పాత్రను పోషిస్తున్నాయని ప్లాస్టిక్ అండ్ క్లైమేట్ అనే సంస్ధ ఇటీవల విడుదల చేసిన తన తాజా నివేదికలో తేల్చి చెప్పింది. ప్లాస్టిక్ వ్యర్ధాలను సక్రమంగా శుద్ధి చేయకుండా వాటిని బహిరంగ ప్రదేశాలలో డంప్ చేయటం లేదా వాటిని కాల్చి వేయటం వల్ల వాతావరణంలోకి పెద్దయెత్తున్న విడుదలవుతున్న కర్బన కలుషితాల వల్ల భూ ఉపరితల ఉష్ణోగ్రతలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. ప్లాస్టిక్ను ఉత్పత్తి చేయటం, దానిని బహిరంగంగా దహానం చేయటం వల్ల ప్రతి ఏడాది 850 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్తో సమానమైన గ్రీన్హౌస్ వాయువులు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి ప్లాస్టిక్ కాలుష్యం వల్ల 1.34 బిలియన్ టన్నుల గ్రీన్హౌస్ వాయువులను వాతావరణంలోకి విడుదల అయ్యే అవకాశముంది. ఇది భూమి మీద ఏటా విడుదలయ్యే మొత్తం కర్బన ఉద్గారాలలో 14 శాతాన్ని ఉంటుంది. 2100 నాటికి అది 260 బిలియన్ టన్నులకు చేరుకుంటుందని ప్లాస్టిక్ అండ్ క్లైమేట్ సంస్ధ అంచనా వేసింది. జలాశయాల్లో కన్నా భూమిపైనే ప్లాస్టిక్ కలుషితాల సాంద్రత అధికంగా ఉందని, సముద్రంలో కన్నా భూమి మీద 4 నుండి 23 రెట్లు అధికంగా ప్లాస్టిక్ వ్యర్ధాలు పేరుకుపోయాయని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలలో కేవలం 9 శాతం మాత్రమే రీసైకిల్ చేయబడుతున్నాయంటే ప్రపంచ దేశాలు ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ దిశగా ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 120 కన్నా ఎక్కువ దేశాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేదాన్ని, జరిమానాలను విధించినప్పటికీ పరిస్థితులలో ఏమాత్రం మార్పు రాలేదు సరికదా, గడిచిన 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం నాలుగు రెట్లు పెరిగింది.
తినే ఆహారంలోను ప్లాస్టిక్కే….
మనం తీసుకుంటున్న ఆహారంలో కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలకు సంబంధించిన మైక్రో ప్లాస్టిక్ రేణువలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వరల్డ్ వైల్డ్ లైఫ్ అధ్యయనం ప్రకారం సగటున ఒక వ్యక్తి ప్రతీ వారం 5 గ్రాముల ప్లాస్టిక్ను ఆహారం ద్వారా తీసుకుంటున్నాడు. తీరప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజల్లో ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్ధాలు ఆహారం ద్వారా మానవుని శరీరంలోకి ప్రవేశిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఉత్తర పసిఫిక్ మహా సముద్రాల్లో చేపలు ఏడాదికి 24వేల టన్నుల ప్లాస్టిక్ను తీసుకుంటున్నాయని, కాలిఫోర్నియా మార్కెట్లో లభ్యమయ్యే పావు వంతు చేపల ప్రేగుల్లో మైక్రో ప్లాస్టిక్ రేణువలను కనుగొన్నారు. ఇవి ఆహారం ద్వారా మానవుల్లోకి చేరుకుని అనేక ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్నాయి. 2020లో మొదటిసారిగా పుట్టబోయే శిశువుల జరాయువుల్లో సైతం మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు కనుగొన్నారు. పుట్టక ముందు నుండే ప్లాస్టిక్ కాలుష్యం వల్ల అనేక అనర్ధాలకు గురవుతున్నారనటానికి ఇదే నిదర్శనం. అమెరికాలో 55 నుండి 64 ఏండ్ల వయసు కలిగిన వారిలో ఏటా లక్షా 7వేల మంది ప్లాస్టిక్ వ్యర్ధాల వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధుల వల్ల అకాల మరణాలకు గురవుతున్నారని ఒక అధ్యయనం స్పష్టం చేసింది. మాంసాహారుల్లోనే కాదు, శాఖాహారుల్లో కూడా ప్లాస్టిక్ కణాలు ఆహారం ద్వారా ప్రవేశిస్తున్నాయని తాజా అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.
పీల్చే గాలిలో సైతం ప్లాస్టిక్
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని వాయువుల్లో శాస్త్రవేత్తలు మైక్రో ప్లాస్టిక్ కణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పటి వరకూ భూమి పొరల్లో నిక్షిప్తమయై భూకాలుష్యానికి, జల వనరుల్లో చేరి జలకాలుష్యానికి ప్లాస్టిక్ వ్యర్ధాలు కారణమవుతాయని భావించే వారు. కానీ బహిరంగ ప్రదేశాలలో ప్లాస్టిక్ వ్యర్ధాలను డంప్ చేయటం, వాటిని బహిరంగంగా కాల్చటం వల్ల అనేక విష వాయువులు వాతావరణంలోకి విడుదలయ్యి అక్కడ ఉండే జీవరాశికి, మానవాళికి ప్రాణాంతక వ్యాధులను కలుగుచేస్తున్నాయి. ఏండ్ల తరబడి భూమి మీద ప్లాస్టిక్ క్షయానికి గురయై చిన్న చిన్న మైక్రో ప్లాస్టిక్ కణాలుగా విడిపోతాయి. సూక్ష్మ పరిమాణంలో ఉండే ఈ మైక్రో ప్లాస్టిక్ కణాలు గాలి ద్వారా జీవుల్లోకి ప్రవేశించి ఊపిరితిత్తులోకి చేరి మరణాలకు కారణమవుతుందని ఇటీవల జరిగిన అనేక పరిశోధనలో తెలింది. మానవుని శరీరంలోని కాలేయం, ప్లీహాం, ఊపిరితిత్తులు వంటి శరీర భాగాల్లో శాస్త్రవేత్తలు మైక్రో ప్లాస్టిక్ అవశేషాలను కనుగొన్నారు. చివరికి తల్లి పాలల్లో కూడా మైక్రో ప్లాస్టిక్ కణాలను కనుగొనబడ్డాయంటే ప్లాస్టిక్ ఎంతటి ప్రమాదకారో అర్ధం చేసుకోవచ్చు. ముడి రూపంలో ఉన్న ప్లాస్టిక్ పర్యావరణ వ్యవస్ధల నుండి వేరు చేయటం సాధ్యమవుతుంది, కానీ మైక్రో ప్లాసిక్గా విడిపోయిన ప్లాస్టిక్ను పర్యావరణం నుండి వేరు చేయటం అసాధ్యమనే చెప్పాలి. ప్రపంచంలోని ఎతైన ఎవరెస్టు శిఖరం నుండి అతి లోతైన ప్రదేశంగా గుర్తింపు పొందిన మరియాణా ట్రెంచ్ వరకూ ప్లాస్టిక్ వ్యర్ధాలు, మైక్రో ప్లాస్టిక్ కణాలు గుర్తించబడ్డాయి.
సముద్రాలను ముంచెత్తుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు ….
భారతదేశంతో పాటు చైనా, ఇండోనేషియా, ఫిలిఫ్పీన్స్, థాయిలాండ్ వంటి దేశాలు ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్ధాలను సముద్రాల్లోకి నేరుగా పారబోస్తున్నాయని ఓషన్ కన్సర్వెన్సీ సంస్ధ తాజాగా ప్రకటించింది. ప్లాస్టిక్ వ్యర్ధాలను నేరుగా సముద్ర జలాలలోకి విడుదల చేస్తున్న దేశాల జాబితాను ఇటీవల ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది. ఈ జాబితాలో ప్లాస్టిక్ వ్యర్ధాలను సముద్రంలోకి నేరుగా వదిలేస్తున్న ప్రపంచ దేశాలలో భారత దేశం రెండవ స్ధానంలో ఉంది. శుద్ధి చేయకుండా 3,56,371 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను నేరుగా సముద్ర జలాల్లోకి వదిలేస్తున్న దేశాలలో ఫిలిఫీన్స్ మొదటి స్ధానంలో ఉండగా, భారతదేశం 1,26,513 టన్నులతో రెండవ స్ధానంలో ఉంది. 73, 098 టన్నులతో మలేషియా మూడవ స్ధానంలో ఉంటే, 70,707 టన్నులతో చైనా, 56, 333 టన్నులతో ఇండోనేషియా వరుసగా నాలుగు, ఐదు స్ధానాలలో ఉన్నాయి. 2021× 22 వార్షిక సంవత్సరంలో ప్లాసిక్ వస్తువుల అవసరత 20.89 మిలియన్ టన్నులుగా ఉండగా, 2023 నాటికి అది 22 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని ఒక అంచనా. దేశంలో 60 శాతానికి పైగా ప్లాస్టిక్ వ్యర్ధాలు రీసైక్లింగ్ చేయబడుతున్నాయని భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే భారత్లో పరిస్థితి దానికి భిన్నంగా ఉందని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన తాజా నివేదిక ద్వారా తెలుస్తుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) గణాంకాల ప్రకారం భారతదేశం తన ప్లాస్టిక్ వ్యర్ధాలలో కేవలం 12 శాతం మాత్రమే రీసైకిల్ చేయగలదు. ఏటా భారతదేశం 3.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ను ఉత్పత్తి చేస్తుంది. 2022 కల్లా దేశంలో ఒకసారి మాత్రమే వినియోగించగలిగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేదిస్తామని 2017లో భారత ప్రభుత్వం ప్రకటన కేవలం నీటి మీద రాతలాగే మిగిలిపోయింది. ఇప్పటికీ దేశంలో పెద్దయెత్తున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు విడుదలవుతున్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించినా, దేశంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్ధాలే దర్శనమిస్తాయి. మూడు దశల్లో ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించటంతో పాటు, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులకు రూపకల్పన చేపడతామని ప్రభుత్వం చేసిన ప్రకటన కూడా పూర్తి స్ధాయిలో కార్యరూపం దాల్చలేదు సరికదా, ప్రపంచంలోనే అతి ఎక్కువ మోతాదులో శుద్ధి చేయని ప్లాస్టిక్ వ్యర్ధాలను సముద్ర జలాల్లోకి నేరుగా పారబోసే దేశాల జాబితాలో రెండవ స్ధానం సంపాదించుకుంది. ప్రపంచ జనాభాలో అతి పెద్ద దేశంగా అవతరించిన భారత దేశం ప్రతి ఏడాది సగటున 5 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను వాతావరణంలోకి విడుదల చేస్తుంది. ప్రతి నెలా భారత దేశంలో 22 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు పోగుపడుతున్నాయని అధికారిక గణాంకాల వల్ల తెలుస్తుంది. దేశంలో గడిచిన 5 ఏండ్లలో ప్లాస్టిక్ వ్యర్ధాల ఉత్పత్తి సుమారు నాలుగు రెట్లు పెరిగింది. దేశవ్యాప్తంగా సేకరించిన చెత్తలో 40 శాతానికి పైగా పల్లపు ప్రదేశాలలో బహిరంగంగా వదిలివేయబడుతున్నాయి. దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం వ్యర్ధాలలో 80 శాతంకి పైగా వ్యర్ధాలు వాతావరణంలోకి నేరుగా విడుదల చేయబడుతున్నాయి. వర్షాకాలంలో ఇవి సమీప నదుల ద్వారా సముద్రంలోకి చేరుకుంటున్నాయి. ముంబై, కేరళ, అండమాన్ నికోబార్ దీవుల చుట్టూ ఉన్న మహా సముద్రాలు ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన సముద్రాలుగా గుర్తించబడ్డాయి.
చిన్న దేశాలే ఆదర్శం…
ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వెదజల్లబడుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాల వల్ల అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువ నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాల్లో రోజురోజుకి పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలను సక్రమంగా నిర్వహించటం ఆర్ధికంగా వెనుకబడిన దేశాలకు తలకు మించిన భారంగా పరిణమిస్తుంది. అందుకే చాలా దేశాలు ప్లాస్టిక్ వ్యర్ధాలను శుద్ధి చేయకుండా నేరుగా పర్యావరణంలోకి వదిలి పెడుతున్నాయి. దీని వల్ల కలిగే అనర్ధాల వల్ల ఆయా దేశాలకు చెందిన ప్రజలు, జీవ జాతులు అనేక ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు తమ దేశంలో ఉత్పత్తి అయిన ప్లాస్టిక్ వ్యర్ధాలను సమీపంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పారవేయటం కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల పాలిట శాపంగా మారుతుంది. అభివృద్ధి చెందిన దేశాల నుండి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్లాస్టిక్ వ్యర్ధాలను చేరవేయడాన్ని ప్రమాదకర వ్యర్ధాలు, ఇతర వ్యర్ధాల సరిహద్దు కదలికలపై 175 దేశాలతో ఏర్పాటు చేయబడిన బాసెల్ కన్వెన్షన్ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రపంచంలోని పేరేనికగన్న దేశాలన్నీ ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే రువాండా వంటి ఒక చిన్న దేశం చిత్తశుద్ధితో ప్లాస్టిక్ కాలుష్యంపై ఎడతెగని యుద్ధమే చేస్తుంది. దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేదించటంతో పాటు దేశంలో అన్ని రకాల ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నిషేదించింది. వస్తువులను ప్లాస్టిక్ వస్తువులతో ప్యాక్ చేయకూడదని వివిధ పరిశ్రమలకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను రీసైకిల్ చేయటంతో పాటు, ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి వ్యతిరేకంగా రూపొందించిన చట్టాలను కఠినంగా అమలు చేయడానికి ఆ దేశం చిత్తశుద్ధితో కృషి చేసింది. ప్రజల సహాకారం, ప్రభుత్వాల చిత్తశుద్ధి కలిసి 2009లో రువాండా ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లాస్టిక్ రహిత దేశంగా అవతరించింది. ఈ దేశంలో ఎవరైనా ప్లాస్టిక్ సంచులు వినిమోగిస్తూ పట్టుబడితే 6 నెలలు జైలు శిక్ష విధించటంతో పాటు పెద్దమొత్తంతో జరిమానా విధిస్తారు. దేశంలోకి ఇతర దేశాల నుండి వచ్చే ప్లాస్టిక్ను నియంత్రించడానికి కూడా రువాండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలో ప్రవేశించే అన్ని వాహానాలను, లగేజీని సరిహాద్దులోనే తనిఖీ చేయటంతో పాటు ప్లాస్టిక్ వస్తువులు ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటారు. సుమారు కోటి 35 లక్షల జనాభా కలిగిన ఒక చిన్న ఆఫ్రికా దేశం ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వాహణ, నిషేదాలలో ప్రపంచ దేశాలను మార్గదర్శకంగా నిలవటం చాలా అభినందనీయం. ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేదించి దాన్ని అత్యంత కఠినంగా అమలు చేస్తున్న దేశాలలో కెన్యా ఒకటి. 2017లో కెన్యాలో ప్లాస్టిక్ బ్యాగు వాడకాన్ని పూర్తిగా నిషేదించారు. ఈ దేశంలో ఎవరైనా ప్లాస్టిక్ బ్యాగ్ను ఉపయోగించినా, ఉత్పత్తి చేసినా, విక్రయించినా 4 నెలల జైలు శిక్షతో పాటు 40వేల డాలర్ల వరకూ జరిమానా విధిస్తారు. కెనడా కూడా ప్లాస్టిక్ వ్యర్ధాలను పూర్తిగా నిర్మూలించడానికి వేగంగా చర్యలు తీసుకుంటుంది. 2021లో కెనడా ప్లాస్టిక్ని ‘టాక్సిక్’ పదార్ధంగా ప్రకటించింది. చిన్న చిన్న దేశాలు పర్యావరణాన్ని రక్షించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే చైనా, భారత్, అమెరికా వంటి దేశాలు నిర్లక్ష్యంగా వ్యవహరించటం పర్యావరణ పరంగా అతి పెద్ద విషాదం. నేటి పాలకులు అనుసరిస్తున్న ఈ నేరపూరిత వైఖరి వల్ల నష్టపోయేది భవిష్యత్తు తరాలే.
ప్రజా చైతన్యమే పరిష్కారం…
మానవాళితో పాటు జీవరాశి మనుగడకు పెద్దయెత్తున్న విఘాతం కలిగిస్తున్న పర్యావరణ సంక్షోభాన్ని నివారించడానికి ప్రపంచంలోని దేశ, ప్రాంత, వర్గ, వర్ణ, కుల, మత, జాతి లింగ భేదాలకు అతీతంగా ప్రపంచ మానవులంతా చైతన్యవంతం కావాల్సిన తరుణమిది. కాలుష్యం అన్నది ప్రపంచంలో ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో సంబంధించిన సమస్య కాదు, అది ప్రపంచ సమస్య. దాన్ని పరిష్కరించాలంటే ప్రపంచమంతా ఒక్కటి కావాలి. ప్రధానంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించాలంటే ఆధునిక మానవుని జీవన విధానంతో పాటు, ఆలోచనా విధానంలో కూడా మౌళికమైన మార్పులు రావాల్సిన అవసరముంది. ప్రపంచ మానవులంతా ఒక నూతన జీవన విధానానికి మళ్లితే తప్ప, భూగోళాన్ని ప్లాస్టిక్ భూతం నుండి విముక్తి చేయలేము. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి ప్రపంచదేశాలకు కొన్ని కఠినమైన మార్గదర్శకాలను రూపొందించాలని యున్ఇపి అడుగులు వేస్తుంది. దానిలో భాగంగా 2024నాటికి మొట్టమొదటి ప్రపంచ ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణా ఒప్పందాన్ని నిర్మించాలని, ఆ ఒప్పందంలో ప్రపంచ దేశాలన్నీ భాగస్వాములు కావాలని యుఎన్ పర్యావరణ అసెంబ్లీ గత ఏడాది ఒక చారిత్రాత్మకమైన తీర్మానాన్ని ఆమోదించింది. దానితో పాటు ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్ (ఐఎన్సి) అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. 2020లో జరిగిన మొదటి సమావేశంలో 21 శతాబ్దంలో పర్యావరణానికి అతిపెద్ద సవాల్గా మారుతున్న ప్లాస్టిక్ కాలుష్యానికి పూర్తి స్ధాయిలో అడ్డుకట్ట వేయడానికి ఒక్కతాటిపైకి రావాలని ప్రపంచ దేశాలను కోరింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తిని పూర్తిగా నిషేదించటంతో పాటు, ప్లాస్టిక్ వ్యర్ధాలను రీసైకిలింగ్ చేసే దిశగా దేశాలను కార్యోన్ముఖులను చేయాలని ఐక్యరాజ్యసమితి భావిస్తుంది. ప్రపంచ దేశాలే కాదు, సమస్త మానవాళి ఒక్కటైతేనే భవిష్యత్తు తరాలను, పర్యావరణాన్ని ప్లాస్టిక్ భూతం నుండి కాపాడుకోగలం. ఆ దిశగా మనమంతా ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు సిద్ధం కావటానికి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేదికగా నిలుస్తుందని ఆశిద్దాం.
డా|| కె. శశిధర్, 94919 91918
జగమంతా ప్లాస్టిక్ మయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES