– సీఐటీయూ పిలుపునకు పెద్ద ఎత్తున స్పందన
– కార్మికవర్గానికి కృతజ్ఞతలు : చుక్కరాములు, పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అమెరికా నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుతున్న క్యూబా ప్రజలకు అండగా కార్మికవర్గం ఉందనీ, సీఐటీయూ పిలుపునకు పెద్ద ఎత్తున స్పందన వస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ తెలిపారు. క్యూబాకు అండగా కార్మికుల నుంచి సంఘీభావ నిధి వసూలు పిలుపులో భాగంగా సీఐటీయూ రాష్ట్ర నాయకత్వం గురువారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విరాళాలను సేకరించింది. తమవం తు సహకారాన్ని అందించిన కార్మికులకు, ప్రజలకు తమ యూనియన్ తరఫున చుక్కరాములు, పాలడుగు భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు.
అంతర్జాతీయ దృక్పథాన్ని విశ్వసించే సీఐటీయూ ప్రపంచంలో కార్మికులు, ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నా అండగా నిలబడుతున్నదన్నారు. తెలంగాణలోని అన్ని రంగాల కార్మికులు సహకారం అందిస్తూ క్యూబాపై అమెరికన్ సామ్రాజ్యవాదం విధిస్తున్న ఆంక్షలకు వ్యతిరేకంగా తమ గొంతు కలిపారని తెలిపారు. ”ప్రపంచ కార్మికులారా ఏకం కండి” అనే నినాదంలోని అసలైన స్ఫూర్తిని కార్మికులకు అర్ధం చేయించేందుకు ఈ సంఘీభావ క్యాంపెయిన్ తోడ్పడిందని పేర్కొన్నారు. ‘క్యూబా సంఘీభావ నిధి సేకరణలో భాగంగా చేపట్టిన కార్యక్రమాల్లో మేడ్చల్, జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతాల్లో పాలడుగు భాస్కర్, పఠాన్చెరులోని శాండ్విక్ పరిశ్రమలో చుక్కరాములు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో మధ్యాహ్న భోజన కార్మికుల నుంచి నిధి వసూలు సేకరణలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ.రమ పాలుపంచుకున్నారు. మెడికల్, హెల్త్ ఉద్యోగుల నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ నిధి సేకరించారు. ఎల్ఐసీలో సంఘీభావ నిధి వసూలు రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేశ్, పద్మశ్రీ, విద్యుత్ ఉద్యోగుల నుంచి నిధి సేకరణలో రాష్ట్ర కార్యదర్శి కె. ఈశ్వర్రావు పాల్గొన్నారు. ఇతర ఆఫీస్ బేరర్లు అయిన జె. చంద్రశేఖర్ – చర్లపల్లిలో, రాగుల రమేష్ – హనుమకొండలో, గోపాలస్వామి – సిద్దిపేటలో, కాసు మాధవి – వరంగల్లో, పి. శ్రీకాంత్ – జగిత్యాలలో, కె. రమేష్ – రంగారెడ్డి రావిర్యాల క్లస్టర్లో జరిగిన క్యూబా సంఘీభావ నిధి వసూలులో పాలుపంచుకున్నారు’ అని వివరాలు వెల్లడించారు.