అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. హస్తం పార్టీ ఇక్కడ జయకేతనం ఎగరేసింది. ఈ ఉప ఎన్నిక ప్రచారం రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపింది. ముఖ్యమంత్రి రేవంత్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. విమర్శలు, ప్రతి విమర్శలు, వాగ్బాణాలు, వ్యంగ్యాస్త్రాలతో క్యాంపెయిన్ దద్దరిల్లింది. ప్రచార సమయంలోనే సీఎం రేవంత్తో మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా ఓ సీనియర్ పాత్రికేయుడు… ‘జూబ్లీహిల్స్లోని ప్రజా సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు…?’ అని అడిగారు. దానికి సీఎం సమాధానమిస్తూనే ఓ కొత్త విషయాన్ని బయటపెట్టారు. ‘ఏం చేస్తాం చెప్పండి… మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు, నేతిబీరకాయలో నెయ్యి ఉండదు, అలాగే మీరు గమనించాల్సిందేమంటే… జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ అనే ప్రాంతమే లేదు. ఆ ప్రాంతం ఖైరతాబాద్ నియోజక వర్గంలో ఉంది. అది తప్ప మిగతావన్నీ జూబ్లీహిల్స్లోనే ఉన్నాయి…’ అనే సరికి సభికులు ఘొల్లు మన్నారు ఆశ్చర్యాన్ని తమ నవ్వులకు జోడించి…
- బి.వి.యన్.పద్మరాజు


