Wednesday, September 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభవనాల ఎన్‌వోసీల జారీలో జాప్యం తగదు

భవనాల ఎన్‌వోసీల జారీలో జాప్యం తగదు

- Advertisement -

అనుమతుల పేరుతో వేదిస్తే కఠిన చర్యలు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బహుళ అంతస్తుల భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి అనుమతుల జారీ విషయంలో జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో బిల్డ్‌ నౌ కింద పనుల అనుమతుల విషయంపై సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్‌ కమ్యూనిటీల నిర్మాణం, ఇతర అనుమతుల విషయంలో ఉద్దేశపూర్వకంగా కొందరు అధికారులు అలసత్వం చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతుల జాప్యంలో ఆలస్యానికి కారకులను గుర్తించి వారిని సరెండర్‌ చేయాలని హెచ్‌ఎండీఏ కార్యదర్శి ఇలంబర్తిని ఆదేశించారు. నీటి పారుదల శాఖ విభాగం అధికారులపై పలు ఆరోపణలు వస్తున్నాయని గుర్తు చేశారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువులు, నాలాలు, ఇతర నీటి వనరులకు సంబంధించి లైడార్‌ సర్వేను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. సమగ్రమైన వివరాలున్నప్పుడు మాత్రమే వివాదాలకు తావుండదని అన్నారు. జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఇరిగేషన్‌ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ త్వరగా అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. ఈ సమీక్షలో హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వి.కర్ణన్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -