పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి
బీడీఎస్ (ఓఎస్ఎం) ఎండీఎస్
కన్సల్టెంట్ మ్యాక్సీల్లోఫేషియల్ సర్జన్ డాక్టర్ వై. విజయలక్ష్మి
నవతెలంగాణ – కంఠేశ్వర్ : ఆహారం లేదా ఇతర పానీయాలు తీసుకునేప్పుడు పొట్టకంటే ముందు ఎక్కువగా సమస్య వచ్చేది దంతాలకే. అతి వేడి, అతి చల్లని పదార్థాలు తిన్నప్పుడు దంతాల చుట్టూ ఉండే చిన్నపాటి లేయర్ తొలగిపోతుంది. దీనివల్ల తొందరగా దంతాలు పాడవుతాయి. ఇలా కాకుండా జాగ్రత్తలు అవసరం.కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. పాలు, చేపలు, మాంసం, ఆకుకూరలు, ఇలాంటి కాల్షియం ఫుడ్ను తినటం వల్ల దంతాలతో పాటు చిగుళ్లూ ఆరోగ్యంగా ఉంటాయి.
బాదం, ధాన్యాలు, అరటిలాంటి మెగ్నీషియం ఉండే ఆహారాన్ని తినాలి. భోజనం తర్వాత దంతాలు మధ్య ఇరుక్కుపోయిన ఆహారం వదిలేస్తే త్వరగా పాడవుతాయి. అందుకే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అర్ధరాత్రి మేలుకోవటం ఉదయాన్నే నిద్రపోవటం చేసినపుడు ఆహారం జీర్ణం సరిగాకాదు. దీంతో పాటు దంతాలు ప్రతిరోజూ శుభ్రంగా ఉంచుకోవటం వల్ల నోటిలోని దుర్వాసన అరికట్టవచ్చు. ఉదయం, రాత్రిపూట దంతాలను శుభ్రం చేసుకోవటం ఉత్తమం. గట్టిగా ఉండే బఠానీలు, ఐస్ ముక్కల్ని, గట్టిగా ఉండే పండ్లను కొరకటానికి ప్రయత్నించకూడదు. దీనివల్ల దంతాలు త్వరగా దెబ్బతింటాయి.చక్కెర, ఉప్పు అధికంగా ఉండే ఆహారపదార్థాలను తినకూడదు. సోడా,కాఫీ, చూయింగ్గమ్ లాంటి వాటి జోలికి పోకూడదు. పిల్లలకు రెగ్యులర్గా దంతాలు శుభ్రం చేయించాలి. పోషకాలుండే ఆహారం, సరైన నిద్రతో పాటు ఏదైనా సమస్య వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకోవటం మంచిది.