ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న జీరో ఎన్రోల్మెంట్
గత ప్రభుత్వంలోనూ, ఇప్పుడూ అదే పరిస్థితి
ఏటా 2 నుంచి 3 లక్షల మంది విద్యార్థుల తగ్గుదల
2023-24లో విద్యార్థుల్లేని స్కూల్స్లో రాష్ట్రానిది మూడోస్థానం
ఎనిమిదో తరగతి తర్వాతపై చదువులకు అనాసక్తి
బడిబాట అయ్యాక టీచర్ల సర్దుబాట్లు
‘ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు మెరుగుపడుతున్నా.. ఇంగ్లీష్ మీడియం బోధన కూడా సమర్థవంతంగా సాగుతున్నా.. వృత్త్యంతర శిక్షణతో టీచర్లలో బోధనా నైపుణ్యాలు మెరుగుపరుస్తున్నా.. ప్రయివేటుకు దీటుగా పదో తరగతి ఫలితాలు సాధిస్తున్నా.. ప్రభుత్వ బడులంటే తెలుగుమీడియం.. ప్రయివేటు స్కూల్స్ అంటే ఇంగ్లీష్ మీడియం..’ అనే వైఖరి నుంచి పేరెంట్స్ బయటపడట్లేదు. యూడైస్ ప్లస్ అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రతియేటా 2-3 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్కు ఉద్వాసన పలకటం సర్కారు బడుల మనుగడపై ఆందోళన కలిగిస్తున్నది.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ ఏటేటా పడిపోతోంది. అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో తప్ప చాలా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) ప్లస్ నివేదిక ప్రకారం గత ఐదేండ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో జీరో విద్యార్థుల నమోదు శాతం పెరుగుతోంది. 2023-24తో పోల్చితే గతేడాది కొంత మెరుగైనా ఓవరాల్గా చూస్తే మాత్రం జీరో ఎన్రోల్మెంట్ పెరుగుతూనే ఉంది. ఏటా 2 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు ఉద్వాసన పలుకుతున్నారు. గడిచిన నాలుగైదేండ్లలో 7 లక్షల మందికి పైగా సర్కారు చదువులను వదులుకొని ప్రయివేటులో చేరారు. జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలల సంఖ్యలో తెలంగాణ 2023-24లో దేశంలో అథమ స్థానంలో ఉంది. ఆ ఏడాది తెలంగాణలో 2,097 ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థుల నమోదు లేక మూతబడ్డాయి. దేశంలో పశ్చిమబెంగాల్ (3,254), రాజస్థాన్ (2,167) తర్వాత స్థానం మన రాష్ట్రానిదే. విద్యాశాఖ లెక్కల ప్రకారం గతేడాది కూడా 1,980 ప్రభుత్వ పాఠశాలలు జీరో ఎన్రోల్మెంట్ కారణంగా మూతబడ్డాయి.
గతేడాది ప్రయివేటులోనే అత్యధిక విద్యార్థులు
రాష్ట్రంలో 30వేల వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో 1,213 స్కూల్స్లో జీరో ఎన్రోల్మెంట్ ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. 13,364 పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ సంఖ్య 50లోపే ఉంది. 1 నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ దాదాపు సమానంగా ఉంటున్నది. అయితే 6 నుంచి 10వ తరగతి చదువు కోసం ప్రయివేటులో చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకు అలా జరుగుతుందని చెప్పడానికి వారు సిద్ధపడట్లేదు. సమగ్ర శిక్షా ప్రాజెక్టు రూపొందించిన ఓ నివేదిక ప్రకారం 44శాతం ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 50మంది విద్యార్థులు కూడా ఉండటం లేదు. 40వేల వరకు ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో కలిపి గతేడాది 60,97,992 మంది విద్యార్థులు విద్యాభ్యాసం సాగించారు. వీరిలో 26,106 ప్రభుత్వ పాఠశాలల్లో 16,85,733 మంది విద్యార్థులు చేరగా 11,757 ప్రయివేటు పాఠశాలల్లో 37,26,220 మంది ఉన్నారు. 18,259 ప్రాథమిక పాఠశాలల్లో 6,94,968 మంది, 3,143 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,91,176 మంది, 4,704 ఉన్నత పాఠశాలల్లో 7,99,589 మంది విద్యార్థులు గతేడాది చేరారు.
8వ తరగతి దాటాకే ఎక్కువ మంది అనాసక్తి..
8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఆ తర్వాత ప్రయివేటులో చేరుతున్నారు. 11.4శాతం విద్యార్థులు డ్రా పౌట్లుగా మిగులుతున్నారు. వీరిలో బాలురు 13.3శాతం ఉంటుండగా బాలికలు 9.5శాతం ఉంటున్నారు. రాష్ట్రంలో 42,369 ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు ఉండగా 11.8 శాతం స్కూళ్లు పదిమంది లోపు విద్యార్థులతో నడుస్తున్నాయి. 500కు పైగా విద్యార్థులున్న స్కూల్స్ కేవలం 8.7శాతం మాత్రమే ఉన్నాయి. ఎన్రోల్మెంట్ పడిపోవడంతో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి కూడా పడిపోయింది. ప్రాథమిక తరగతుల్లో 19, ప్రాథమికోన్నత తరగతుల్లో 12, సెకండరీ స్కూళ్లలో 9, హయ్యర్ సెకండరీలో 25 మంది విద్యార్థులకు ఒక టీచర్ చొప్పున ఉన్నారు.
ఒక్క విద్యార్థి నుంచి..
వైరా మండలం నారపనేనిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకే ఒక్క విద్యార్థిని, ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారు. ఈ ఏడాది ఆ స్కూల్ను మూసివే యాలని నిర్ణయించారు. కానీ మీడియాలో కథనాలు ప్రచురితమైన తర్వాత ఆ విద్యార్థినే ఆ స్కూల్ బ్రాండ్ అంబాసిడర్గా మార్చారు. అక్కడ చదువుతున్న కేతన ఫొటోను స్కూల్ గోడపై వేయించడం గమనార్హం. సర్కారు స్కూల్ ఆవశ్యకతపై నినాదాలు రాశారు. బడిబాట ద్వారా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పాఠశాలను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. ప్రయివేటు స్కూల్స్ తరహాలో ఆ బడికి రంగులద్దారు. ఇప్పుడు ఆ పాఠశాలలో చేరేందుకు పదుల సంఖ్యలో విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు.. కార్పొరేట్ స్థాయికి దీటుగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల విద్యార్ధుల సంఖ్య ఎక్కువగానే ఉంది. టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎన్రోల్మెంట్ పెంచేందుకు విశేష కృషి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరిచి.. పేరెంట్స్ వైఖరిలో మార్పు వచ్చేలా చేస్తే మరింత మంది చేరుతారనేందుకు నారపనేనిపల్లి స్కూల్నే ప్రత్యక్ష ఉదాహరణగా చూపిం చొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలని, దీనివల్ల ప్రభుత్వ స్కూళ్లలో మార్పు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం కొత్తగా ఎంత ఎన్రోల్మెంట్ జరిగిందనేది తేలడానికి కొద్దిరోజులు అగాల్సిందే. ఆ తర్వాతనే టీచర్ల సర్దుబాటు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఏటేటా పెరుగుతున్న సున్నా నమోదు స్కూల్స్..
ఏటేటా సున్నా నమోదు స్కూల్స్ సంఖ్య పెరుగుతోంది. విద్యాశాఖ లెక్కల ప్రకారం 2021-22లో 1086 సున్నా నమోదు స్కూల్స్ ఉండగా, 2022-23 నాటికి ఆ సంఖ్య 1,307కు పెరిగింది. 2023-24 నాటికి 2,097కు చేరింది. 2024-25 నాటికి ఒకింత తగ్గి 1,980కి చేరినా ఓవరాల్గా చూస్తే జీరో నమోదు ఏటేటా పెరుగుతోంది. గతేడాది 1900 ప్రాథమిక, 40 ప్రాథమికోన్నత, హైస్కూల్స్లో 40 చొప్పున జీరో ఎన్రోల్మెంట్ నమోదైంది. గడిచిన ఐదేండ్లలో సరాసరిన 894 స్కూల్స్ విద్యార్థుల నమోదు లేక మూతపడ్డాయి. గతేడాది ఖమ్మం జిల్లాలో 62 పాఠశాలల్లో సున్నా విద్యార్థులు నమోదయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ నమోదైంది.
మూత’బడి’పోతున్నారు..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES