8 ఇండ్లల్లో బంగారం, వెండి, నగదు చోరీ
తాళాలు వేసి ఉన్న ఇండ్లే టార్గెట్
నవతెలంగాణ-బోడుప్పల్
సంక్రాంతి పండుగ వేళ దొంగలు రెచ్చిపోయారు. తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి వరుస ఇండ్లలో దొంగలు హల్చల్ చేసి బంగారం, వెండి, నగదును భారీ స్థాయిలో చోరీ చేసిన సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలోని చెంగిచర్లలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెంగిచర్లలో అనుశక్తి నగర్, కనకదుర్గ నగర్లో గురువారం రాత్రి సమయంలో తాళాలు వేసి ఉన్న 8 ఇండ్లలో దొంగలు తాళాలు పగులగొట్టి చోరికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీంలతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మొత్తం సుమారు 25 తులాల బంగారం,6 కేజీల వెండి,2 లక్షలకు పైగా నగదు చోరీకి గురైనట్టు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఫిర్యాదుదారుల నుంచి వివరాలను సేకరించిన అనంతరం చోరికి గురైన ఇండ్లల్లో ఆధారాలు సేకరించారు. త్వరలో దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా ఈ చోరీ జరిగిన ఇండ్లను డీసీపీ సురేష్, ఏసీపీ చక్రపాణి, మేడిపల్లి సీఐ ఆర్.గోవింద్ రెడ్డి సందర్శించారు.



