ముంబయి : నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్ఎస్ఈ) ఎనిమిదేండ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు పబ్లిక్ ఇష్యూకు రానుంది. సెబీ అనుమతులు లభించే అవకాశం ఉంది. ఎన్ఎస్ఇ లిస్టింగ్ అంశాన్ని స్వయంగా సెబీ చైర్మెన్ తుహిన్ కాంత పాండే వెల్లడించారు. ఎన్ఎస్ఈ ఐపీఓకు సంబంధించిన అన్ని పెండింగ్ సమస్యలు త్వరలోనే తొలగనున్నాయన్నారు. అయితే ఎప్పటిలోగా ఈ సమస్యలు పరిష్కారమవుతాయనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. రెగ్యులేటరీ ఆందోళన నేపథ్యంలో ఎన్ఎస్ఈ ఐపీఓ ప్రతిపాదన గత ఎనిమిదేండ్లకు పైగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్దనే పెండింగ్లో ఉంది. సిబ్బందికి ఇచ్చే పరిహారం, క్లియరింగ్ కార్పొరేషన్లో యాజమాన్యం, టెక్నాలజీ వంటి అనేక అంశాలపై సెబీ పలు ప్రశ్నలు సంధించింది. దీని కారణంగా ఐపీఓ రాక ఆలస్యం అవుతోంది. ఎన్ఎస్ఈ విలువ సుమారు రూ.4.7 లక్షల కోట్లుగా ఉంది. దీంతో భారత్లోనే 10వ అత్యంత విలువైన ప్రయివేటు కంపెనీగా నిలిచింది.