– ఆగివున్న డీసీఎంను ఢకొీట్టిన ఆటో
– కందుకూరు పీఎస్ పరిధిలో ఘటన
నవతెలంగాణ-కందుకూరు
ఫార్మాసిటీ రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎంను వెనక నుంచి ఆటో ఢకొీట్టడంతో ఆటో డ్రైవర్, ఇద్దరు కూలీలు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. కందుకూరు సీఐ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. యాచారం మండలం కుర్మిద్ద గ్రామానికి చెందిన కూలీలు ప్రతిరోజూ ఆటోలో రావిరాల వద్ద ఉన్న క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ కంపెనీకి వెళ్తారు. అక్కడ హౌస్ కీపర్లుగా పనిచేస్తుంటారు. రోజు మాదిరిగానే శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కుర్మిద్ద గ్రామానికి చెందిన సురిగి శ్రీనివాస్(39) ఆటోలో పంది శ్రీధర్(26), పంది సత్తెమ్మ(49)తోపాటు మొత్తం 13 మంది పని కోసం వెళ్లారు. రాత్రి పని ముగిసిన తర్వాత అదే ఆటోలో అందరూ గ్రామానికి బయలుదేరారు. ఎన్టీఆర్ తండా దాటిన తర్వాత డీసీఎం డ్రైవర్ మోసిన్ఖాన్ రోడ్డుపై వాహనం నిలిపాడు. ఎలాంటి సిగల్ లేకుండా నిలపడంతోపాటు డీసీఎం వాహనంతోపాటు వెనకాల ఒక ఆర్ఎంపీ పంపు (కాంక్రీటు పంపు) బండి తగిలించి ఉంది. అయితే ఆటో డ్రైవర్కు వర్షం.. చీకటి వల్ల రోడ్డుపై నిలిచి ఉన్న డీసీఎం కనిపించకపోవడంతో వెనుక నుంచి ఆర్ఎంసీ పంపును ఢకొీట్టాడు. ఆటో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సురిగి శ్రీనివాస్, కూలీలు పంది శ్రీధర్, పంది సత్తమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. ఆటోలో ప్రయాణించిన పంది లింగమ్మ, పంది జంగమ్మ, పంది స్వరూప, పంది శాంతమ్మ, పంది హంసమ్మ, గోపాలి అరుణ, గోపాలి మంజులకు తీవ్ర గాయాలయ్యాయి. గోపాలి, పంది రేణుక, సిద్దిగారి లావణ్యకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని కూలీలు ఆరోపించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES