పెన్షనర్లకు డీఆర్
తెలంగాణకు నాలుగు కేంద్రీయ విద్యాలయాలు
దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విద్యాలయాలు
రబీ పంటలకు కనీస మద్దతు ధర : కేంద్ర మంత్రివర్గం నిర్ణయం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర ్నెస్ అలవెన్స్ (డీఏ), పెన్షనర్లకు డియర్ నెస్ రిలీఫ్ (డీఆర్) మూడు శాతం పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం నాడిక్కడ ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. 2025 జులై 1 నుంచి ఇది అమలులోకి వస్తుంది. డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ రెండింటినీ పెంచడం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.10,083.96 కోట్ల భారం పడనుంది. దీనివల్ల దాదాపు 49.19 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.72 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. తాజా నిర్ణయంతో డియర్నెస్ అలవెన్స్ రేటు 55 నుంచి 58 శాతానికి పెరిగింది.
తెలంగాణకు నాలుగు కేంద్రీయ విద్యాలయాలు
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం (యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్), ములుగు జిల్లా కేంద్రం (గిరిజన ప్రాంతం), జగిత్యాల జిల్లాలోని జగిత్యాల రూరల్ మండలం చెల్గల్, వనపర్తి జిల్లాలోని నాగవరం శివార్లో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు రూ.5862.55 కోట్లు ఖర్చు చేయను న్నారు. 57 కేవీల్లో కేంద్ర హౌం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏడు, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో 50 నడవనున్నాయి. ఇందులో ఇప్పటి వరకు కేవీలు లేని జిల్లాలకు 20, ఆస్పిరేషనల్ జిల్లాలకు 14, నక్సలిజం ప్రభావిత ప్రాంతాలకు నాలుగు, ఎన్ఈఆర్/పర్వత ప్రాంతాలకు 5 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించారు. దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తారు.
రబీ పంటలకు కనీస మద్దతు ధర
2026-27 మార్కెటింగ్ సీజన్ కోసం రబీ పంటలకు కనీస మద్దతు ధరల (ఎంఎస్పీ)కు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదించింది. గోధుమకు రూ.2,585, బార్లీకి రూ.2,150, శనగపప్పుకు రూ.5,875, మసూర్ రూ.7,000, ఆవాలుకు రూ.6,200, కుసుమకు రూ.6,540 మద్దతు ధర నిర్ణయించింది.
పప్పు దినుసుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి రూ.11,440 కోట్లు
ఆత్మ నిర్భర భారత్ కింద పప్పు దినుసుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం రూ.11,440 కోట్లు కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తాన్ని 2025-26 నుంచి 2030-31 వరకు ఆరేండ్ల పాటు ఖర్చు చేశారు. పరిశోధన, క్వాలిటీ సీడ్స్, ట్రైనింగ్, మౌలిక వసతుల పెంపు, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెంపు, ధర స్థిరీకరణ నిధి తదితర అంశాలపై ఖర్చు చేస్తుంది. 2030-31 నాటికి 370 లక్షల హెక్టార్లలో పప్పు ధాన్యాల సాగు చేసే రైతులకు 126 లక్షల క్వింటాళ్ల సర్టిఫైడ్ విత్తనాలను పంపిణీ చేస్తారు.
వరి బీడు ప్రాంతాలు, ఇతర వైవిధ్యభరితమైన భూములను లక్ష్యంగా చేసుకుని, అంతర పంటలు, పంట వైవిధ్యీకరణను ప్రోత్సహించడం తో పప్పుధాన్యాల విస్తీర్ణాన్ని అదనంగా 35 లక్షల హెక్టార్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం 88 లక్షల విత్తన కిట్ను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. 1000 ప్రాసెసింగ్ యూనిట్లతో సహా పంటకోత అనంతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో సహాయ పడుతుంది. తద్వారా పంట నష్టాలను తగ్గించడం, విలువ జోడింపును మెరుగుపరచడం, రైతుల ఆదాయాలను పెంచుతుంది. ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ యూనిట్ల ఏర్పాటుకు గరిష్టంగా రూ.25 లక్షల సబ్సిడీ లభిస్తుంది.
బయో మెడికల్ రీసెర్చ్ కెరీర్ ప్రోగ్రాం ఫేజ్-3కి ఆమోదం
బయో మెడికల్ రీసెర్చ్ కెరీర్ ప్రోగ్రాం (బీఆర్సీపీ) ఫేజ్-3కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2025-26 నుంచి 2030-31 వరకు బయో టెక్నాలజీ విభాగం, యూకేలోని వెల్కమ్ ట్రస్ట్ భాగస్వామ్యంతో అమలు చేస్తారు. ఈ ప్రాజెక్టులో రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అస్సాంలోని కాలిబోర్ నుంచి నుమాలిఘర్ సెక్షన్ మధ్య జాతీయ రహదారి (715)ను నాలుగు లైన్లకు విస్తరించేందుకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. మొత్తం 85.675 కిలో మీటర్ల మేర రహదారి విస్తరణకు మొత్తం రూ.6,957 కోట్లు ఖర్చు చేయనున్నారు. వందేమాతరం గేయం 150 ఏండ్ల ఉత్సవాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.