– ఎంపిక చేసిన యూపీఎస్సీ
– సీవీ ఆనంద్, ప్రభాకర్ ఆపే, సౌమ్యమిశ్రా పేర్లతో రాష్ట్రానికి జాబితా
– ఇందులో ఒకరిని డీజీపీగా ఎంపిక చేసే అవకాశం
నవతెలంగాణ – ప్రత్యేక ప్రతినిధి
ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లతో కూడిన జాబితాను రాష్ట్ర పోలీసు బాస్ డీజీపీ పోస్టుకోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. జాబితాలో పేర్కొన్న సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి సీవీ ఆనంద్, కెేంద్రంలో డిప్యూటేషన్పై ఉన్న డీజీపీ ప్రభాకర్ ఆప్టే, రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రాల పేర్లు ఉన్నాయి. వీరిలో నుంచి ఒకరిని రాష్ట్ర డీజీపీగా ప్రభుత్వం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ఇన్చార్జి డీజీపీగా ఉన్న బత్తుల శివధర్రెడ్డి సర్వీసు వచ్చే నెల 30తో ముగియనుంది. దీంతో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు యూపీఎస్సీ ప్రతిపాదించిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల నుంచి ఒకరిని రాష్ట్ర కొత్త డీజీపీగా ప్రభుత్వం ఎంపిక చేసుకోవాల్సి ఉంది. రాష్ట్ర డీజీపీగా ఎంపిక చేసే అధికారుల పేర్లను ఎంపిక చేసుకునేందుకు యూపీఎస్సీకి రాష్ట్ర సర్కారు నుంచి సీవీ ఆనంద్, ప్రభాకర్ ఆప్టే, అభిలాశబిస్తు, శిఖాగోయల్, సౌమ్య మిశ్రా పేర్లు యూపీఎస్సీకి వెళ్లాయి. కాగా ఇందులో అభిలాశ బిస్తు ఈ ఏడాది జూన్ నెలలో రిటైర్ కానున్నారు. దీంతో 1990వ బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్, 1994 బ్యాచ్కి చెందిన ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రాలను వారి రికార్డులను పరిశీలించి డీజీపీ పోస్టుకు అర్హులైన వారిని యూపీఎస్సీ ఎంపిక చేసి పంపించింది. దీంతో ఈ ముగ్గురు అధికారుల్లో ఎవరికి డీజీపీ బాధ్యతలను రాష్ట్ర సర్కారు అందిస్తుందోననే ఉత్కంఠ ఐపీఎస్ వర్గాలో నెలకొంది. సీవీ ఆనంద్ గతంలో నగర పోలీసు కమిషనర్గా, ఏసీబీ డైరెక్టర్ జనరల్గా, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్గా, సీఈడీ ఇన్చార్జిగా పలు కీలకమైన బాధ్యతలు నిర్వహించి సమర్ధుడైన ఐపీఎస్ అధికారికిగా పేరుపొందారు. ఆయనకు గతంలోనే సీనియార్టీని బట్టి డీజీపీ పోస్టు దక్కాల్సిందనే అభిప్రాయం ఐపీఎస్ వర్గాల్లో ఉంది. ఇక ప్రభాకర్ ఆప్టే సైతం రాష్ట్ర క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి గా ఎస్పీ స్థాయి నుంచి డీఐజీ వరకు పలు పోస్టుల్లో పని చేశారు. అనంతరం దాదాపు 15ఏండ్ల క్రితం ఆయన కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్పై వెళ్లి, డీజీపీ హోదా వచ్చేంత వరకు కూడా అక్కడే ఉన్నారు. ఇక ఒరిస్సా రాష్ట్రానికి చెందిన డాక్టర్ సౌమ్య మిశ్రా రాష్ట్ర ఐపీఎస్ అధికారిగా పలు కీలకమైన పోస్టులను నిర్వహించారు. సమర్ధురాలైన ఐపీఎస్ అధికారిగా పేరుపోందిన ఆమె డీజీపీ హోదాకు చేరుకున్నాక రాష్ట్ర జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ విభాగం డైరెక్టర్ జనరల్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాగా శివధర్ రెడి స్థానంలో వీరిలో ఎవరిని నియమించేది ఏప్రిల్ మాసంలో శివధర్రెడ్డి రిటైర్మెంట్ తర్వాత సీఎం నిర్ణయం తీసుకుంటారా? లేక ఈ మధ్యలోనే దానికి సంబంధించిన ప్రకటన వస్తుందా వేచి చూడాలి.
డీజీపీ పోస్టుల ముగ్గురు సీనియర్ ఐపీఎస్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



