రాష్ట్రం నుంచి వివాన్ శరద్ మహిశ్వరికి 100 పర్సంటైల్ స్కోర్
నవతెలంగాణ-హైదరాబాద్
జేఈఈ మెయిన్ పేపర్-1 ఫలితాలను సోమవారం ఎన్టీఏ అధికారులు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోరును సాధించగా తెలుగు విద్యార్థులు ముగ్గురు సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వివాన్ శరద్ మహిశ్వరి, ఏపీ నుంచి నరేంద్రబాబు గారి మహిత్, పసల మోహిత్ 100 పర్సంటైల్ స్కోరుతో అదరగొట్టారు. ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా 13,55,293 మంది రిజిస్టర్ చేసుకోగా.. 13,04,653 (96.26%) మంది హాజరయ్యారు. దేశంలో ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్ పేపర్ -1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
అదే విధంగా జనవరి 29న నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలను త్వరలో ప్రకటించనున్నారు. మరోవైపు, జేఈఈ మెయిన్ మలి విడత పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగు తోంది. మొదటి విడత పరీక్షలో సాధించిన స్కోరుతో సంతృప్తి చెందని వారు రెండో విడత పరీక్షలు రాస్తుంటారు. ఏప్రిల్ 2 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ రెండింటిలో ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని విద్యార్థులకు ర్యాంకులను కేటాయిస్తారు. ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2.50లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు. ఇందులో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.



