నవతెలంగాణ – హైదరాబాద్: 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని భారత సైన్యం సరిహద్దుల్లో భద్రతను అప్రమత్తం చేసింది. జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లా తంగ్ధార్ గ్రామం వద్ద ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి చొరబాట్లను పూర్తిగా అడ్డుకునేందుకు మూడంచెల పటిష్ఠ భద్రతా వ్యూహాన్ని అమలు చేస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో పాటు మానవ వనరులను సమన్వయం చేస్తూ ఈ కొత్త రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ భద్రతా ఏర్పాట్లపై గురువారం ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు. “నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లకు ఏమాత్రం ఆస్కారం లేకుండా చూడటమే మా ప్రధాన కర్తవ్యం. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు మేము మూడంచెల వ్యవస్థను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నాం” అని ఆయన వివరించారు.
మూడంచెల రక్షణ వ్యవస్థ ఇలా..
మొదటి అంచె: ఇందులో అత్యాధునిక నిఘా పరికరాలను వినియోగిస్తున్నారు. రాడార్లు, థర్మల్ ఇమేజింగ్ సైట్లు, ఆయుధాలు-హెల్మెట్లకు అమర్చే కెమెరాలు, మానవ రహిత వాహనాలు (యూఏవీలు లేదా డ్రోన్లు) వంటి టెక్నాలజీతో సరిహద్దును 24 గంటలూ పర్యవేక్షిస్తారు. శత్రువుల కదలికలను ముందుగానే పసిగట్టడం దీని ముఖ్య ఉద్దేశం.
రెండో అంచె: చొరబాటుదారులను భౌతికంగా నిలువరించేందుకు అడ్డంకుల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కీలకమైన ప్రదేశాల్లో వివిధ రకాల మందుపాతరలతో పాటు ఇతర ఆప్టికల్ వ్యవస్థలను అమర్చారు.
మూడో అంచె: సైనికులు నేరుగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో భద్రతను పర్యవేక్షిస్తారు. సైనిక బృందాలు నిరంతరం గస్తీ కాయడంతో పాటు, ఆకస్మిక మెరుపు దాడులు నిర్వహిస్తూ మొత్తం ప్రాంతాన్ని తమ అధీనంలో ఉంచుకుంటాయి.
ఇటీవల సుందర్బని సెక్టార్లో మీడియా ప్రతినిధులకు సైన్యం తమ ఆధునిక ఆయుధ సంపత్తిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించింది. స్మార్ట్ ఫెన్స్ వ్యవస్థ, క్వాడ్కాప్టర్లు, బుల్లెట్ప్రూఫ్ వాహనాలు, ఎలాంటి భూభాగంలోనైనా ప్రయాణించే వాహనాలు (ఏటీవీలు), ఆధునిక ఆయుధాలు, రాత్రిపూట స్పష్టంగా చూసేందుకు వీలు కల్పించే నైట్ విజన్ పరికరాలను ప్రదర్శనకు ఉంచారు.