నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని దేవాలయాలకు సంబంధించిన మూగజీవాలను పశుసంపదను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్టు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తూ గ్రామపంచాయతీ కార్యాలయంలో యువకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. జుక్కల్ మండల కేంద్రానికి సంబంధించిన పలు ఆలయాలకు ఆవులు భక్తులు మొక్కుకున్న మొక్కులను తీర్చుకోవడానికి సుమారుగా ఏడు పెద్ద ఆవులు , మూడు లేగ దూడలు వదిలేశారు.
ఆలయ ఆస్తిగా పశు సంపదను గ్రామస్తులు భావించేవారు. ఆవులు ఎప్పుడూ గ్రామంలోని వీధులలో సంచరించుకుంటూ ప్రతి ఇంటికి తిరుగుతు ఉండేవి. గ్రామంలోని ప్రజలు ఆవులకు తమ వద్ద ఎక్కువైనా ఆహారాన్ని పెట్టేవారు. గత వారం పది రోజులుగా ఆవులు గ్రామంలో కన్పించకపోవడంతో గ్రామస్తులకు అనుమానం మొదలైంది. ఎవరైనా దొంగలు ఎత్తుకెళ్లారా? ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాయా? అనుమానిస్తున్నారు. కనిపించకుండా పోయిన ఆవులు, ఆవు లీగ దూడల విషయాన్ని గ్రామ సర్పంచ్ కు తెలియజేశారు. ప్రస్తుతము గ్రామంలో ఒక ఆవు మాత్రమే కనిపిస్తుందని మిగతా తొమ్మిది ఆవులు, లేగ దూడలు కనిపించడం లేదని జిపిలో గ్రామ యువకులు ఫిర్యాదు చేశారు.



