చైనాతో ఒప్పందం కుదిరింది : ట్రంప్
వాషింగ్టన్ : అమెరికాలో వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగబోతున్నాయి. ఇందుకు సంబంధించి చైనాతో ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒప్పందం వివరాలను ఖరారు చేసేందుకు శుక్రవారం చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడతానని ఆయన చెప్పారు. ‘మా దేశంలో అనేక పెద్ద కంపెనీల గ్రూపు ఉంది. అది టిక్టాక్ను కొనుగోలు చేయాలని అనుకుంటోంది. మీకు తెలుసు….చిన్నారులు దానిని బాగా ఇష్టపడతారు’ అని అన్నారు. చాలా మంది తల్లిదండ్రులు తనకు ఫోన్ చేస్తున్నారని, టిక్టాక్ యాప్ తమకు అవసరం లేకపోయినా పిల్లల కోసం కావాలని కోరుతున్నారని తెలిపారు. టిక్టాక్ యాప్ లేకపోతే పిల్లలతో అనేక సమస్యలు ఎదురవుతాయని వారు అంటున్నారని చెప్పారు. వేదిక నుంచి వైదొలగాలని, లేకుంటే నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని టిక్టాక్ యజమాని బైట్డ్యాన్స్ను హెచ్చరిస్తూ ట్రంప్ మంగళవారం కార్యనిర్వాహక ఆదేశంపై సంతకం చేశారు. ఇందుకు డిసెంబర్ 16వ తేదీ వరకూ గడువు పొడిగించారు.
గత నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో తనకు యువత ఓట్లు ఎక్కువగా రావడానికి టిక్టాక్ ఎంతో సాయపడిందని ట్రంప్ గతంలో ప్రశంసించారు. కాగా చైనాతో కుదుర్చుకోబోయే ఒప్పందం ప్రకారం…టిక్టాక్లో చైనా యాజమాన్య వాటా 20 శాతం కంటే తగ్గిపోతుందని వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్ పత్రికలు తెలిపాయి. కాగా ఒప్పందాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార వార్తా పత్రిక చైనా పీపుల్స్ డైలీ స్వాగతించింది. పరస్పర ప్రయోజన సహకారానికి ఇది ఓ ఉదాహరణ అని తెలిపింది. దేశ ప్రయోజనాలు, చైనా సంస్థల చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపింది. ట్రంప్ తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం టిక్టాక్ను కొనసాగించాలని భావిస్తున్నారని ఆర్థిక ప్రొఫెసర్ యాన్ లియాంగ్ వ్యాఖ్యానించారు.
అమెరికాలో టిక్టాక్ కార్యకలాపాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES