పరిశుభ్రత, పేషెంట్ కేర్పై స్పెషల్ ఫోకస్
నిమ్స్ తరహాలో టిమ్స్లకు స్వయం ప్రతిపత్తి
క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల నడుమ స్పష్టమైన పని విభజన: అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి దామోదర
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సనత్నగర్, కొత్తపేట్, అల్వాల్ టిమ్స్ హాస్పిటళ్లను కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా తీర్చిదిద్దాలని ఉన్నతాధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలో పరిశుభ్రత, పేషెంట్కేర్కు సమ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నిమ్స్ తరహాలో టిమ్స్లలోనూ స్వయం పాలన వ్యవస్థ ఉండాలన్నారు. త్వరలో సనత్నగర్ టిమ్స్ ప్రారంభించనున్న నేపథ్యంలో, అధికారులతో మంగళవారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదరు కుమార్, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజరుకుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్, ప్రొఫెసర్ విమలా థామస్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు, ఎయిమ్స్లో అవలంభిస్తున్న విధానాలపై ఇప్పటికే అధికారులు అధ్యయనం చేసి రూపొందించిన నివేదికలోని అంశాలను అధికారులు మంత్రికి వివరించారు.
కార్పొరేట్ హాస్పిటళ్లలో క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాలు పని చేస్తున్న విధానం, డాక్టర్లు, సిబ్బంది సంఖ్య, పెడుతున్న ఖర్చు, తదితర అంశాలను మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్నిరకాల వసతులతో హాస్పిటళ్లు ఉండాలనీ, అందుకు అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కార్పొరేట్ హాస్పిటళ్ల తరహాలో క్లినికల్ సర్వీసెస్, అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్, అకాడమిక్స్ విభాగాలు వేర్వేరుగా ఉండాలని సూచించారు. నిమ్స్ తరహాలో మెడికల్ డైరెక్టర్, మెడికల్ సూపరింటెండెంట్తో పాటుగా చీఫ్ ఆపరేషనల్ ఆఫీసర్ కూడా ఉండాలన్నారు. ఏయే విభాగానికి ఎవరు బాధ్యులు, ఎవరి పని ఏంటి అన్నదానిపై స్పష్టమైన జాబ్చార్ట్ ఉండాలని మంత్రి ఆదేశించారు. గతంలో ధనవంతులు, పెద్ద పెద్ద నాయకులు కూడా చికిత్స కోసం గాంధీ, ఉస్మానియాకు వెళ్లేవారని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు టిమ్స్లను ఆ స్థాయిలో తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.