ఎన్నికల వేళ పిటిషన్లు దాఖలుపై సుప్రీం వ్యాఖ్యలు
ఇందుకు కోర్టుల్ని వేదికగా ఉపయోగించవద్దు
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకు సుప్రీం కోర్టును ఒక వేదికగా ఉపయోగిస్తూ పిటిషన్లు దాఖలయ్యే ధోరణికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అడ్డుకట్ట వేశారు. ప్రైవేటు పక్షాలు, ఎన్జిఓలు దాఖలు చేస్తున్న పిటిషన్లు రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకున పెట్టేలా రూపొందుతున్నాయని త్రిసభ్య బెంచ్కు నాయకత్వం వహిస్తున్న చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియలో పిటిషనర్లు సుప్రీం కోర్టును రాజకీయ కోలాహలంలోకి లాగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్లు కోర్టులో వార్నింగ్ బెల్స్ వినిపిస్తున్నాయని అన్నారు. సరిగ్గా ఎన్నికల వేళనే ఇటువంటి పిటిషన్లు దాఖలవడం సాధారణంగా అనుమానాలు రేకెత్తిస్తున్నాయని అన్నారు. ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్న కేరళలో పివిసి ఫ్లెక్స్ బోర్డులు ఏర్పాటు చేయడంపై ఎన్జిఓ, మానవ హక్కుల ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ”ఇక్కడ సమస్య ఏమిటంటే సుప్రీం కోర్టులో రాజకీయ పోరాటాలు మొదలు పెడుతున్నారు. అది కేరళనా లేక మరొకటా, మరొకటా అనేది ఇక్కడ విషయం కాదు. ఇదంతా కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందికర పరిస్థితుల్లో ఇరికించేందుకే. ఏదో రకంగా వారికి క్లిష్టమైన పరిస్థితులను సృష్టించాలనే.” అని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. ఇటువంటి పిటిషన్లు ఎన్నికల ప్రచారానికి అవరోధంగా భావించబడతాయన్నారు. ”పైగా ఇలాంటి పిటిషన్లు దాఖలయ్యే సమయం అత్యంత అనుమానాస్పదంగా వుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇది చేయకూడదు, అది చేయకూడదని ఆంక్షలు విధించాలంటూ పిటిషన్లు దాఖలవుతూ వుంటాయి. ఇలా ఎన్ని రాష్ట్రాలను మీరు నియంత్రించాలనుకుంటారు” అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ఇలాంటి వాటిల్లో కోర్టు పాత్ర ఏమిటనే విషయం తమకు తెలుసని అన్నారు. న్యాయపరంగా జోక్యం చేసుకోవడం అనివార్యమని భావించినపుడు తప్ప ఇలాంటి విషయాల్లో ఉత్తర్వులు జారీ చేయబోమని స్పష్టం చేశారు. దీనిపై ఎన్జిఓ తరపు న్యాయవాది వాదిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో తన వైఖరి తెలియచేసింది. వంద శాతం పివిసి ఫ్లెక్స్లను బహిరంగ ప్రాంతాల్లో వాణిజ్య ప్రకటనల ప్రయోజనాలకు వాడడాన్ని నిషేధిస్తూ ఇప్పటికే ఆదేశాలున్నాయన్నారు. అయితే ఎన్జిఓ పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకున పెట్టేందుకే !
- Advertisement -
- Advertisement -



