భూగర్భ జలాలను పెంచేందుకు ఇంకుడు గుంతల ఏర్పాటు
బస్తీ దవాఖానాలల్లో అందుబాటులో మందులు
సన్న బియ్యం పంపిణీతో పేదల్లో సంతోషం : హైదరాబాద్ జిల్లా సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరవాసుల తాగునీటి దాహార్తిని తీర్చేందుకు కృష్ణ, గోదావరి నుంచి 15 టీఎంసీల నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం జీహెచ్ఎంసీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటుచేసిన హైదరాబాద్ జిల్లాస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, సివిల్ సప్లై, వైద్య ఆరోగ్యం, ఎలక్ట్రిసిటీ, విద్య తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజీవ్ యువ వికాస పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి కేటగిరీల వారీగా రుణాలు అందిస్తామన్నారు. హైదరాబాద్ జిల్లాలో 41,726 మంది నిరుద్యోగ యువతకు రుణాలు అందించాలన్న లక్ష్యం కాగా, 1,25, 595 మంది నిరుద్యోగ యువకులు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. రాజీవ్ యువశక్తి పథకానికి రూ. 6230.52 కోట్లు కేటాయించామన్నారు. సన్న బియ్యం పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మే నుంచి 653 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెలా 14500 మెట్రిక్ టన్నుల బియ్యం అందిస్తున్నామన్నారు. వర్షాకాలం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో మూడు నెలలకు గాను 42,619 మెట్రిక్ టన్నుల సన్నబియాన్ని కేటాయించడం జరిగిందని, అందులోనుండి ఇప్పటివరకు 8440 మెట్రిక్ టన్నుల బియ్యన్ని రేషన్ షాపులకు అందించడం జరిగిందన్నారు. రేషన్ కార్డుల సర్వే ప్రక్రియ చేపట్టామని త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ స్థలాలు తక్కువగా ఉన్నందున ఇల్లు కట్టించేందుకు ఇబ్బంది ఉన్నప్పటికీ ప్రత్యేక ప్రణాళికతో అర్హులైన పేదలకు ఇండ్ల నిర్మాణాలు చేపట్టి అందించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే కట్టిన 62,500 పైగా ఉన్న రెండు పడకల ఇండ్లను ప్రభుత్వంతో చర్చించి ఈనెల 15 వరకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. స్థలాలున్న పేదలకు అత్యంత ప్రాధాన్యతతో రెండు పడకల ఇండ్లను నిర్మించి ఇవ్వనున్నట్టు చెప్పారు.
జూన్ 12 వరకు స్కూల్ యూనిఫామ్ లతోపాటు పాఠ్యపుస్తకాలు, టెస్ట్ బుక్స్ అందించడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ జిల్లాలో వర్షపు నీటి ద్వారా భూగర్భ జలాలు పెంచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఆ దిశలో భాగంగా ప్రతి 300 గజాల ఇంటి స్థలం ఉన్నవారు ఇంకుడు గుంతలు చేపట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించడం జరిగిందని అందులో 76 వాటర్ లాగింగ్ పనులు పూర్తి చేశామన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లాలోని 169 బస్తీ దవఖానాలలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు శాసనమండలి సభ్యులు లేవనెత్తిన అనేక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరించనున్నట్టు మంత్రి తెలిపారు. వర్షాకాలం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు, చెట్లు ప్రగతికి మెట్లు కాబట్టి చేసిన ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జలమండలి కమిషనర్ అశోక్ రెడ్డి,హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య తీర్చేందుకుకృష్ణా,గోదావరి ద్వారా 15 టీఎంసీల నీరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES