– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నేటి బాలలే రేపటి తెలంగాణ భవిష్యత్ పౌరులని మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో బాలల హక్కుల కమిషన్ కార్యకలాపాలపై కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. బాలల హక్కుల కమిషన్ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన చర్యలు, ఎదురవుతున్న సమస్యలను ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాస్థాయిలో మహిళా, శిశుసంక్షేమ శాఖ నుంచి మరింత సహకారం అందించాలని కమిషన్ విజ్ఞప్తి చేసింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి చిన్నారికి ఆరోగ్యకరమైన బాల్యం అందించడానికి మిషన్ వాత్సల్య ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాల వారీగా సిబ్బంది నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యుల నియామకానికి దరఖాస్తుల గడువు ఈ నెల 8తో ముగిసినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో, గడువు పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో బాలల హక్కుల కమిషన్ మరింత క్రియాశీలకంగా పని చేయడానికి తమ శాఖ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఈ సమీక్షలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ సృజన, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
నేటి బాలలే రేపటి తెలంగాణ భవిష్యత్ పౌరులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES