సీసీఐ రీజనల్ కార్యాలయం ఎదుట పత్తి రైతుల ధర్నా : తెలంగాణ పత్తి రైతుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న చలో వరంగల్ కార్యక్రమం చేపడుతున్నామనీ, అక్కడ సీసీఐ రీజనల్ కార్యాలయం ఎదుట రైతులతో ధర్నా నిర్వహిస్తామని తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ భూక్యా చందునాయక్, రాష్ట్ర కో-కన్వీనర్ మూడ్ శోభన్ నాయక్ ప్రకటించారు. ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తేమతో నిమిత్తం లేకుండా సీసీఐ ద్వారా పత్తి పంటను కొనుగోలు చేయాలనీ, రైతులు పండించిన పత్తి పంటను ఎక్కడైనా స్వేచ్ఛగా విక్రయించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తిపై 11 శాతం సుంకాన్ని ఎత్తేయడాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులకు, ముఖ్యంగా కౌలు రైతులకు నష్టదాయకంగా ఉన్న కిసాన్ కపాస్ యాప్ను రద్దు చేయాలని కోరారు. సీసీఐ ఆధ్వర్యంలో గతంలో మాదిరిగా ప్రతి ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. క్వింటా పత్తిపై రూ.475 బోనస్ ఇవ్వాలని కోరారు. మ్యాపింగ్ పేరుతో కాటన్ మిల్లుల దగ్గరలో ఉన్న గ్రామాల రైతులను సుదూర ప్రాంతాలకు పంపడం వలన రవాణా చార్జీలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్ వాసిరెడ్డి వరప్రసాద్, రాష్ట్ర నాయకులు అన్నవరపు సత్యనారాయణ, యలమంచిలి వంశీకృష్ణ, బొంతు రాంబాబు, మాదినేని రమేష్, కందాల శంకర్ రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, శెట్టి వెంకన్న, రాజన్న, ఆముదాల మల్లారెడ్డి, వెంకట్ మావో, చల్లారపు తిరుపతి రెడ్డి, మిల్కురి వాసుదేవ రెడ్డి, బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రేపు చలో వరంగల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



