నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భూ భారతి రెవిన్యూ సదస్సు లో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు మండల తహసీల్దార్ లను ఆదేశించారు. బుధవారం రోజున మినీ మీటింగ్ హాల్ మండల తహసీల్దార్ లతో భూ భారతి రెవిన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధించిన అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలని అన్నారు.
అన్ని మాడ్యుల్స్ లో దాఖలైన భూ భారతి దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలి అన్నారు. భూ భారతి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.సక్సేషన్, పెండింగ్ మ్యూ టేషన్, డేటా కరెక్షన్ వంటి దరఖాస్తులను అవసరమైన రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని,దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన తర్వాతే పరిష్కరించాలని అన్నారు.
ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను మండల తహసీల్దార్ లాగిన్ లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ జరపాలన్నారు.అవసరమైన రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. రెవిన్యూ పరంగా ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, రెవిన్యూ డివిజనల్ అధికారులు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, మండల తహసీల్దార్ లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.