నవతెలంగాణ-హైదరాబాద్ :పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వానల కారణంగా మిరిక్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి బీభత్సానికి పర్యాటక ప్రాంతాలైన మిరిక్, కుర్సియాంగ్లను కలిపే కీలకమైన దూదియా ఐరన్ బ్రిడ్జి పూర్తిగా కుప్పకూలింది. దీంతో ఆ ప్రాంతాల మధ్య రవాణా సంబంధాలు తెగిపోయాయి.
కుర్సియాంగ్ సమీపంలోని జాతీయ రహదారి 110పై ఉన్న హుస్సేన్ ఖోలా వద్ద కూడా కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనల కారణంగా పలు గ్రామాలకు వెళ్లే మార్గాలతో పాటు జాతీయ రహదారులు కూడా బురదతో నిండిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డార్జిలింగ్, కాలింపాంగ్, కూచ్బెహార్, జల్పైగురి, అలీపుర్దువార్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో సోమవారం ఉదయం వరకు కుండపోత వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తన బులెటిన్లో పేర్కొంది.