భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై పునరాలోచన
యూఎస్ సుప్రీంకోర్టు తీర్పుతో అనిశ్చితి
న్యూఢిల్లీ : భారతదేశం-అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ఫిబ్రవరి 23న వాషింగ్టన్లో ప్రారంభం కావాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. ఒప్పందంలో భాగంగా జరగాల్సిన ప్రధాన సంధానకర్తల కీలకమైన సమావేశం సోమవారం ప్రారంభం కావాల్సి ఉంది. ట్రంప్నకు వ్యతిరేకంగా అమెరికా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, తర్వాత ప్రకటించిన కొత్త పన్ను విధానాలు అనిశ్చితిని పెంచాయి. దీంతో సమావేశం వాయిదా పడింది. దర్పన్ జైన్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం, అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్, అతని బృందం సమావేశం కావాల్సి ఉంది. ఫిబ్రవరి 20న, ట్రంప్ పరిపాలన విధించిన దిగుమతి పన్నులు రాజ్యాంగ విరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
దీని తర్వాత, ఫిబ్రవరి 24 నుంచి అన్ని దేశాలపై కొత్తగా 10 శాతం పన్ను విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. మరుసటి రోజు దాన్ని 15 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. ఈ కొత్త పరిస్థితులు ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయో అస్పష్టంగా ఉంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై విస్తృత సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ, భారతదేశంతో వాణిజ్య ఒప్పందంలో మార్పు ఉండదని ట్రంప్ వెల్లడించారు. ఒప్పందం ప్రకారం భారతదేశం నుంచి వచ్చే వస్తువులపై విధించిన 18 శాతం సుంకం కొనసాగుతుందని కూడా ఆయన పునరుద్ఘాటించారు.



