– నేషనల్ ట్రేడర్స్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మెన్ సునీల్ జే సింఘీ
– డిజిటల్ దుకాన్ యాప్ను ఆవిష్కరణ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాస్థాయిల్లో వ్యాపారుల సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని నేషనల్ ట్రేడర్స్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మెన్ సునీల్ జే సింఘీ తెలిపారు. వ్యాపారుల సంక్షేమాన్ని సంస్థాగతీకరించడంలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే అన్ని ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య సౌకర్యాల కేంద్రాలను నిర్మిస్తున్నామన్నారు. ఆదివారం తారామతి బారాదరిలో ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నాల్గవ జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా డిజిటల్ దుకాన్ యాప్ను ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వ్యాపారులకు బలమైన ప్రాతినిధ్యం, విధాన మద్దతు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. రిటైలర్లు, పంపిణీదారులు, బ్రాండ్లను ఓపెన్ డిజిటల్ నెట్వర్క్లో అనుసంధానించడం ద్వారా వాణిజ్యాన్ని ఏకీకృతం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. సాంకేతిక ఆధారిత లాజిస్టిక్స్ పరిష్కారాల కోసం తొలిసారిగా ట్రేడర్-టెక్ ప్లాట్ఫామ్ను డిజి దుకాన్ యాప్ ద్వారా అనుసంధానం చేశామన్నారు. దీనివల్ల భారతదేశ వాణిజ్య పర్యావరణ వ్యవస్థలో ఒక కొత్త సాంకేతిక విప్లవం ప్రారంభమైందనీ, దీనిద్వారా వస్తు సరఫరా గొలుసు చిట్టచివరి రిటైల్ నెట్వర్క్ వరకు సులభంగా చేరుతుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం వ్యాపారులకు రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను ఉపశమనం, జీఎస్టీ 2.0 సంస్కరణలు, ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ స్ఫూర్తి వంటి పలు అంశాలను ఆయన తన ప్రసంగంలో వివరించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ కృష్ణ, ఆర్కే గౌర్, విభోర్ జైన్ తదితరులు పాల్గొన్నారు. వారితోపాటు 13 రాష్ట్రాల నుంచి ఆ సంఘం సభ్యులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
జిల్లాస్థాయిలో వ్యాపారుల సంక్షేమ బోర్డులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



