Saturday, June 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండ్రోన్‌ కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ పర్యవేక్షణ

డ్రోన్‌ కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ పర్యవేక్షణ

- Advertisement -

– టాఫిక్‌ వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి ప్రయత్నం
– రాబోయే రోజుల్లో మరిన్ని నియామకాలు
– ‘ఆపరేషన్‌ రోప్‌’ను శాస్త్రీయ పద్ధతిలో బలోపేతం చేస్తాం : హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ను డ్రోన్‌ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని, వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి గూగుల్‌ కంపెనీ సహాయం తీసుకుంటున్నామని నగర సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు, పరిష్కార మార్గాలపై నగర ట్రాఫిక్‌ విభాగం నేతృత్వంలో శుక్రవారం బంజారాహిల్స్‌లోని సీసీసీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి నగర సీపీ, డీజీ సీవీ ఆనంద్‌ హాజరయ్యారు. ట్రాఫిక్‌ నియంత్రణ, నిర్వహణ ప్రాథమిక సూత్రాలపై ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ డి.జోయల్‌ డెవిస్‌తో కలిసి సీపీ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. గత ఏడాది వరకు నగరంలో వాహనాల సగటు వేగం గంటకు 17 నుంచి 18 కిలోమీటర్లు ఉండేదని, ప్రస్తుతం ఇది గంటకు 24 నుంచి 25 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. ట్రాఫిక్‌ పోలీసులు ఎంతో కష్టపడితేనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాని తెలిపారు. ప్రతిరోజూ సుమారు 1600 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయని, మూడు కమిషనరేట్ల పరిధిలో కలిపి ఒక్క రోజే 91 లక్షల వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్‌ రోప్‌’ నుంచి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. దీనిని మరింత శాస్త్రీయ పద్ధతిలో బలోపేతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. వీఐపీల రాకపోకలపై ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని, సీఎం కూడా తన ప్రయాణ సమయాల్లో ఎక్కువ సేపు ట్రాఫిక్‌ను నిలపొద్దని ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 80 శాతం సిగల్స్‌ ఆటో మోడ్‌లో నడుస్తున్నాయన్నారు.ట్రాఫిక్‌ వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి గూగుల్‌ మ్యాప్స్‌తోపాటు, గూగుల్‌ వారు సాంకేతికంగా తమకు సహకరిస్తున్నారని ప్రశంసించారు. నగరంలోని బహుళ అంతస్తుల భవనాల యజమానుల సహకారంతో 25 భవనాలపై ‘హైరేస్‌ కెమెరాలను’ బిగించి ‘ఈగల్‌ వ్యూ’ను సేకరిస్తున్నామన్నారు. ఈ విధానంతో ట్రాఫిక్‌ అధికారులు ముందస్తుగా సమస్యలను గుర్తించి, స్థానిక ట్రాఫిక్‌ అధికారులను అప్రమత్తం చేయడం, దానికి తగ్గట్టు పరిష్కార మార్గాలను సూచించడం జరుగుతుందని తెలిపారు. నగరంలో ట్రాఫిక్‌ సిబ్బంది కొరత ఉన్నందున, ‘ట్రాఫిక్‌ మార్షల్‌’ వ్యవస్థను ప్రవేశపెడుతున్నామన్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) కింద వారే మార్షల్స్‌ను నియమించుకోవాలని, వారికి శిక్షణ ఇచ్చి ట్రాఫిక్‌ నియంత్రణకు ఉపయోగిస్తామని తెలిపారు. ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్‌ అసిస్టెంట్లుగా చక్కగా విధులు నిర్వహిస్తున్నారని, మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదికను సమర్పించామన్నారు. రాబోయే రోజుల్లో ట్రాఫిక్‌ విభాగంలో మరిన్ని నియామకాలు చేపడతామని, ఇతర శాఖలలో కూడా నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని తెలిపారు. రాబోయే వర్షాకాలం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, హైడ్రా, జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నామన్నారు. నగరంలో ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సుల వల్ల అవాంతరాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, దానిపై యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు సీసీలు, జాయింట్‌ సీపీ, డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు తదితర అధికారులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -