– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఈనెల 2వ తేదీ నుండి రెండు విడతలుగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు విడతల్లో ఆరు రోజుల చొప్పున జరిగే ఈ వార్డు సభ్యుల శిక్షణ తరగతులను మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండల పంచాయతీ అధికారి సదాశివ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిక్షణ తరగతులు ఈనెల 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు మొదటి బ్యాచ్, ఈనెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు రెండవ బ్యాచ్ లో వార్డు సభ్యులకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
మొదటి బ్యాచ్ లో దొమ్మరి చౌడు తండా, అమీర్ నగర్, ఈనాయత్ నగర్, కొత్త చెరువు తండా, నాగాపూర్, నర్సాపూర్, చౌట్ పల్లి, రాజరాజేశ్వరి నగర్ గ్రామాలకు చెందిన 66మంది వార్డు సభ్యులు హాజరవ్వాలని ఎంపీడీవో కోరారు. రెండవ బ్యాచ్ లో కోనాపూర్, బషీరాబాద్,హాస కొత్తూరు, కోన సముందర్, ఉప్లూర్, కమ్మర్ పల్లి గ్రామాలకు చెందిన 72 మంది వార్డు సభ్యులు శిక్షణ తరగతులకు హాజరుకావాలన్నారు. ఈ విషయాన్ని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు వార్డు సభ్యులకు తెలియజేసి, షెడ్యూల్ ప్రకారము 100 శాతం వార్డు సభ్యులు హాజరయ్యాలా చూడాలన్నారు.
శిక్షణ కాలంలో సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులు హాజరై శిక్షణ ఏర్పాట్లలో సహకరించాలని ఆదేశించారు. శిక్షణ తరగతులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను మండల పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందని, వార్డు శిక్షణ తరగతులు విజయవంతంగా ముగించుటకు ప్రతి ఒక్కరు సహకరించాలని విన్నవించారు. వార్డు సభ్యుల శిక్షణ సందర్భంగా హాజరయ్యే సభ్యులకు భోజనం ఏర్పాట్లు, టీ బిస్కెట్, స్నాక్స్ తదితర అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు.



