– బీఎస్6 వాహనాలకు ఇంధన గండం
– స్తంభించనున్న దేశ ఆర్థిక వ్యవస్థ..!
– ఏప్రిల్ నుంచి డీజిల్ వాహనాల నిలిపివేత..!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి రవాణా రంగం సంక్షోభం అంచునకు చేరింది. అమెరికా సామ్రాజ్యవాద చర్యలతో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారత్లోని సరుకు రవాణా వ్యవస్థను కుప్పకూల్చే స్థాయికి చేరుకున్నాయి. డీజిల్ వాహనాల కదలికకు ప్రాణాధారమైన టెక్నికల్ గ్రేడ్ యూరియా (టిజియు) దిగుమతులు నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా లక్షలాది ట్రక్కులు నడవలేని ప్రమాదం పొంచి ఉందని ఆటోమొబైల్ పరిశ్రమ సంఘం సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ అసోసియేషన్ (సియోమ్) ఆందోళన వ్యక్తం చేస్తోంది.
డిఇఎఫ్ లేకపోతే ఇంజిన్ డెడ్
బిఎస్6 నిబంధనల ప్రకారం తయారైన ఆధునిక డీజిల్ వాహనాలు, డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ (డిఇఎఫ్) ఉంటేనే పని చేస్తాయి. పొగలో హానికర వాయువులను తగ్గించే ఈ ద్రవం అయిపోతే వాహనంలోని ఇంటర్లాక్ మెకానిజం ఇంజిన్ను ఆటోమేటిక్గా ఆపివేస్తుంది. ప్రస్తుతం ఈ డిఇఎఫ్ తయారీకి వాడే టిజియు సరఫరా నిలిచిపోనుందని తెలుస్తోంది. వచ్చే ఏప్రిల్ నాటికే నిల్వలు నిండుకుంటాయని సియోమ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫలితంగా నిత్యావసర వస్తువుల సరఫరా నుంచి భారీ యంత్రాల తరలింపు వరకు ప్రతిదీ నిలిచిపోయే ప్రమాదం ఉంది.
60 శాతం దిగుమతులే..
భారత్ తన టిజియు అవసరాల్లో దాదాపు 60 శాతం దుబారు, ఈజిప్ట్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. కాగా.. ఇరాన్ యుద్ధం కారణంగా షిప్పింగ్ మార్గాల్లో ఎదురవుతున్న అడ్డంకులు, ఆకాశాన్ని తాకుతున్న ఇన్సూరెన్స్, రవాణ ఛార్జీలు దిగుమతిదారులను వెనక్కి తగ్గేలా చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన ఈ అస్థిరత దేశీయంగా రవాణా ఛార్జీల పెరుగుదలకు తద్వారా ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంది.
దేశీయంగా ఉత్పత్తి పతనం..
ఒకవైపు టిజియు దిగుమతులు ఆగిపోగా.. మరోవైపు దేశీయంగా దీన్ని ఉత్పత్తి చేసే ఏకైక సంస్థ గుజరాత్ నర్మదా వ్యాలీకి గెయిల్ నుంచి గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సహజ వాయువు సరఫరాను గెయిల్ తగ్గించడం పుండు మీద కారం చల్లినట్లయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని దేశీయ ఉత్పత్తిని యుద్ధప్రాతిపదికన పెంచాలని, దిగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సియామ్ విజ్ఞప్తి చేస్తోంది. సకాలంలో స్పందించకపోతే దేశం భారీ రవాణా సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తోందని హెచ్చరించింది.
సంక్షోభం అంచున రవాణ వ్యవస్థ
- Advertisement -
- Advertisement -



