నవతెలంగాణ-హైదరాబాద్: మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలిపై నేపాల్ ప్రభుత్వం ప్రయాణ ఆంక్షలు విధించింది. ఓలితో పాటు మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్, జాతీయ భద్రతా సంస్థ మాజీ హెడ్ హుతారాజ్ థాపా మరియు మరో ఇద్దరు సీనియర్ అధికారులపై కూడా ప్రయాణ నిషేధం విధించినట్లు అంతర్గత మంత్రి సోమవారం తెలిపారు.
హింసాత్మక ఘటనలపై తాత్కాలిక ప్రధాని సుశీల్ కర్కి నియమించిన విచారణ కమిషన్ ఆదివారం ఈ పరిమితులను సిఫారసు చేసింది. అయితే నిషేధం ఇప్పటికే అమలులో ఉందని సోమవారం హోంమంత్రి ఓప్రకాష్ ఆర్యల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఐదుగురు వ్యక్తులు నేపాల్ వీడాలంటే వారు అనుమతి తీసుకోవాలని, ఏ సమయంలోనైనా విచారణకు హాజరుకావాల్సిందేనని కమిషన్ సభ్యుడు బిగ్యన్ రాజ్ శర్మ తెలిపారు. ఆటోమొబైల్, హోటల్ మరియు రిటైల్ ఇండిస్టీస్ సహా ప్రైవేట్ రంగానికి 600 మిలియన్ డాలర్ల నష్టం ఏర్పడినట్లు నేపాల్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్టీ (ఎఫ్ఎన్సిసిఐ) తెలిపింది.
సోషల్మీడియా ఖాతాలపై విధించిన నిషేధం, ఆర్థిక సంక్షోభం, అవినీతికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 8న జెన్జెడ్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో రెండు రోజుల్లో సుమారు 73మంది మరణించారు. పార్లమెంట్, ప్రభుత్వ భవనాలు దగ్ధమయ్యాయి. దీంతో నేపాల్ ప్రధాని కె.పి. శర్మఓలి రాజీనామా చేశారు.