– రాష్ట్రంలో ఆర్జీయూకేటీ రెరడో క్యాంపస్ను మంజూరు చేసిన ప్రభుత్వం
– 2025-26 విద్యాసంవత్సరం నుంచే ప్రవేశాలు
– 180 సీట్ల భర్తీకి అనుమతి
– ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) త్రిపుల్ఐటీ ప్రాంగణాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్రంలో బాసరలో ఆర్జీయూకేటీ త్రిపుల్ఐటీ మొదటి ప్రాంగణం ఉన్నది. మహబూబ్నగర్లో రెండో క్యాంపస్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా బుధవారం ఉత్తర్వులు (జీవోనెంబర్ 24) విడుదల చేశారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచే మహబూబ్నగర్ త్రిపుల్ఐటీలో ప్రవేశాలను చేపడుతు న్నట్టు ప్రకటించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)లో 60 సీట్లు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషీన్ లెర్నింగ్) (సీఎస్ఈ ఏఐఅండ్ ఎంఎల్)లో 60 సీట్లు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) డాటాసైన్స్లో 60 సీట్ల చొప్పున మొత్తం 180 సీట్ల భర్తీకి అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. బడ్జెట్, పోస్టులకు సంబంధించిన ఉత్తర్వులను ప్రత్యేకంగా విడుదల చేస్తామని తెలిపారు.
ప్రస్తుతానికి ప్రయివేటు భవనంలో తరగతులు
మహబూబ్నగర్లో ఏర్పాటు చేసే త్రిపుల్ఐటీ ప్రాంగణాన్ని ప్రయివేటు భవనంలో తాత్కాలికంగా తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు అక్కడే తరగతుల నిర్వహణతోపాటు హాస్టల్ వసతి ఉండేలా అధికారులు పరిశీలించారు. కొత్త త్రిపుల్ ఐటీ ప్రాంగణం కోసం మహబూబ్నగర్ అర్బన్ మండలం ఎదిర గ్రామ పరిధిలో సుమారు 41 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించినట్టు తెలిసింది. మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఆ భూమి వివరాలను ప్రభుత్వానికి సమర్పించినట్టు సమాచారం. అందులో శాశ్వత భవనాలను నిర్మించనున్నారు. ఇంకోవైపు హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలోనూ త్రిపుల్ఐటీ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశమున్నట్టు సమాచారం. ఒకవేళ 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలను చేపట్టడానికి వీలు కాకుంటే 2026-27 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు ముందు ఎల్కతుర్తిలో త్రిపుల్ఐటీ ప్రాంగణాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే అవకాశమున్నది.
2008లో ఆర్జీయూకేటీ ప్రారంభం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008, మార్చిలో ఆర్జీయూ కేటీని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రారంభిం చారు. బాసర, నూజివీడు, ఇడుపులపాయ (ఆర్కే వ్యాలీ)లో మూడు త్రిపుల్ఐటీ ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడి పోయింది. దీంతో తెలంగాణలో బాసరలో మాత్రమే త్రిపుల్ఐటీ ప్రాంగణం వచ్చింది. తొలుత ఒక్కో ప్రాంగ ణంలో రెండు వేల సీట్లను భర్తీ చేశారు. తర్వాత దాన్ని వెయ్యి సీట్లకు కుదించారు. ప్రస్తుతం 1,500 సీట్లను బాసర త్రిపుల్ఐటీలో ఏటా భర్తీచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం త్రిపుల్ఐటీలను నెలకొల్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రవేశాల్లో ప్రాధాన్యత ఉన్నది.
మహబూబ్నగర్లో త్రిపుల్ఐటీ ప్రాంగణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES