నవతెలంగాణ-హైదరాబాద్: ప్రతీకార సుంకాలతో చైనాపై యూఎస్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. ట్రంప్ కక్షపూరితమైన చర్యలను గట్టిగానే వ్యతిరేకించిన బీజింగ్ ప్రభుత్వం..ముల్లును ముళ్లుతోనే తీయాలనే చందంగా.. యూఎస్ దిగుమతులపై అదే స్థాయిలో సుంకాలు విధించి..అమెరికా ప్రెసిడెంట్కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య రెండు దేశాలు ప్రతీకార సుంకాలపై ఓ అంగీకరానికి వచ్చాయి. దీంతో చైనా, అమెరికా మధ్య వైరం సమసిపోయింది అనుకునే లోపే తాజాగా మరో వివాదానికి ట్రంప్ ప్రభుత్వం తెరలేపింది.అమెరికాలో చైనా విద్యార్థుల వీసాలు రద్దు చేయడానికి ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో ఓ ప్రకటనలో వెల్లడించారు.
మంత్రి మార్కో రూబియో తాజాగా ట్విట్టర్ వేదికగా..‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయడానికి అమెరికా విదేశాంగ శాఖ ‘హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖతో కలిసి పని చేస్తుంది. చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తాం.వీరిలో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నవారు, కీలక రంగాలలో చదువుతున్నవారు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇక, అమెరికాలో భారత్, తర్వాత చైనా విద్యార్థులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా విద్యార్థులే రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. 2023-2024 విద్యా సంవత్సరానికి గాను చైనా నుండి 2,70,000 మంది విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. తాజా ట్రంప్ నిర్ణయంతో ఆదేశ విద్యార్థులపై పెను ప్రభావం చూపనుంది.