ప్రచ్ఛన్నయుద్ధం కాదు..సమానత్వం కావాలి !
అమెరికాకు బ్రెజిల్ అధ్యక్షులు లూలా హితవు
న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల మధ్య కొత్త ప్రచ్ఛన్నయుద్ధాలను తాము కోరుకోవడం లేదని, దేశాలన్నిటికీ సమాన ప్రాధాన్యతలు లభించాలని అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్నకు బ్రెజిల్ అధ్యక్షులు లూలా ద సిల్వా హితవు పలికారు. ట్రంప్ టారిఫ్లు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రపంచ దేశాలపై 15 శాతం టారిఫ్లు విధిస్తున్నట్టు ట్రంప్ మరోమారు ప్రకటించిన నేపథ్యంలో లూలా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్లో పర్యటిస్తున్న లూలా ఆదివారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘మేము కొత్త ప్రచ్ఛన్నయుద్ధాన్ని కోరుకోవడం లేదని అమెరికా అధ్యక్షులు ట్రంప్కి చెప్పాలనుకుంటున్నాను. మరే ఇతర దేశంలోనూ జోక్యం చేసుకోవాలని కోరుకోవడం లేదు.
అన్ని దేశాలను సమానంగా చూడాలని కోరుకుంటున్నాం’ అని లూలా హితవు పలికారు. ట్రంప్ సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్పందించేందుకు లూలా నిరాకరించారు. ‘మరో దేశానికి చెందిన సుప్రీంకోర్టు నిర్ణయంపై స్పందించడం భావ్యం కాదు. అయితే అమెరికాతో బ్రెజిల్ సంబంధాలు త్వరలో సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆశిస్తున్నాం’ అని ఆయన అన్నారు. ట్రంప్తో సమావేశం కోసం లూలా వచ్చేనెల అమెరికా వెళ్లే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ చర్చల తర్వాత బ్రెజిల్-అమెరికా సంబంధాలు సాధారణ స్థితికి చేరుకుంటాయని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. బ్రెజిల్.. ప్రపంచం సంక్షోభాలను కోరుకోవడం లేదని, శాంతి, సామరస్యతలను కోరుకుంటోందని తెలిపారు.



