భారత్, చైనాపై వందశాతం సుంకాలు వేయాలి
ఈయూ దేశాలకు అమెరికా అధ్యక్షుడి సూచనలు
మరోవైపు భారత్తో వాణిజ్య చర్చలంటూ ట్రంప్ లీకులు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఓ వైపు భారత్, చైనా దేశాలపై వందశాతం సుంకాలేయాలంటూ ట్రంప్ ఈయూ దేశాలకు సూచనలు చేస్తున్నారు. మరోవైపు భారత్తో వాణిజ్య చర్చలంటూ వైట్హౌస్ లీకులిస్తోంది. ఇపుడు ఇదే హాట్ టాపిక్గా మారింది.
భారత్, చైనాలపై 100 శాతం సుంకం విధించండి..
ఉక్రెయిన్ యుద్ధం ముగించే అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. దీంతో ఆయన ఆగ్రహంతో రగిలిపోతున్నారనటానికి ఇది తాజా ఉదాహరణ. భారత్, చైనాలపై సుంకాల భారాన్ని పెంచి రష్యాపై ఒత్తిడి తీసుకురావటానికి ఆయా దేశాల దిగుమతులపై 100 శాతం సుంకాలు విధించాలని ట్రంప్ యూరోపియన్ యూని యన్ (ఈయూ)ను కోరినట్టు తెలుస్తోంది. ఈమేరకు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొన్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై సీనియర్ అమెరికన్, ఈయూ అధికారులు వాషింగ్టన్లో సమావేశ మయ్యారు. ఈసందర్భంగా ఈయూ అధికారులతో ట్రంప్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడారు. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్, చైనాలపై 100 శాతం సుంకం విధించాలని సూచించిన ట్టు తెలుస్తోంది. చమురు కొనుగోలు చేయడం ఆపేస్తామనే వరకు ఈ టారిఫ్లను కొనసాగిం చాలన్నారు. ‘మేము ఇలా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, యూరోపియన్ భాగస్వాముల తో కలిసి ముందుకువస్తేనే దీన్ని అమలు చేద్దాం’ అని యూఎస్ అధికారి ఒకరు తెలిపారు. అమెరికా సూచనలు అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఈయూ అధికారులు పేర్కొన్నట్టు సమాచారం. అయితే భారత్, చైనా వంటి దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తే నెలకొనే పరిణామాలపై వారు చర్చలు జరుపుతున్నారు. మరోవైపు.. భారత్తో వాణిజ్య చర్చలు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. వాణిజ్యానికి అడ్డంకిగా ఉన్న అంశాలపై ఇరు పక్షాలు సంప్రదింపులు కొనసాగిస్తాయని తెలిపారు. భారత ప్రధాని మోడీ ‘ఒక మంచి స్నేహితుడు’ అని మరోసారి ప్రశంసించారు. త్వరలోనే ఆయనతో ముచ్చటిస్తానని అంటూ సమస్యకు ‘విజయవంతమైన ముగింపు’ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్-అమెరికా వాణిజ్య చర్చలు కొనసాగుతాయని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో తొలిసారిగా ప్రకటించడం గమనార్హం. ట్రంప్ నుంచి ప్రకటన వెలువడిన కొద్ది గంటల తర్వాత మోడీ సానుకూలంగా స్పందించారు. అయితే తమ మధ్య నెలకొన్న వ్యక్తిగత స్నేహంపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ‘భారత్, అమెరికా దేశాలు సన్నిహిత మిత్రులు. సహజ భాగస్వాములు’ అని మోడీ తెలిపారు. త్వరలో నే ట్రంప్తో చర్చలు జరపాలని భావిస్తున్నానని చెప్పారు. భారత్-అమెరి కా భాగస్వామ్యం పరిమితులు లేనిదని, దానిని మరింత ముందు కు తీసుకుపోయేందుకు వాణిజ్య చర్చలు దోహదపడతాయని అన్నారు. సాధ్య మైనంత త్వరగా చర్చలు జరిగేలా రెండు దేశాల బృందాలు కృషి చేస్తాయని చెప్పారు. ఇదిలావుండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై ఒత్తిడి పెంచడానికి భారత్, చైనా దేశాలపై వంద శాతం టారిఫ్ విధించాలని ట్రంప్ మంగళవారం యూరోపియన్ యూనియన్కు సూచించారు. అయి తే రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న భారత్పై ఈయూ ప్రస్తుతం ఎలాంటి జరిమానాలు విధించడం లేదు. భారత్, అమెరికా మధ్య గత కొన్ని నెలలుగా ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ట్రంప్ సుంకాల భారాన్ని యాభై శాతానికి పెంచారు. ఈ చర్య సమర్ధనీయం, సహేతుకం కాదని భారత్ విమర్శించింది. దేశ ప్రయోజనాలను, మార్కెట్ వ్యూహాన్ని దృష్టిలో పెట్టుకొని రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే ట్రంప్ కొద్ది రోజుల క్రితం తన వైఖరిని కొంత మార్చుకున్నారు. భారత్, అమెరికా మధ్య ప్రత్యేక సంబంధాలు ఉన్నాయని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని చెప్పారు.
నేనూ వెయిట్ చేస్తున్నా
భారత్, అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్ : మోడీ
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పోస్టుపై భారత ప్రధాని మోడీ స్పందించారు. వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన మిత్రుడైన మోడీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్టు ట్రంప్ చెప్పగా, భారత్- అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్ అని మోడీ పోస్ట్ చేశారు. రెండు దేశాలు సహజ భాగస్వాములని తెలిపారు. ఇరుదేశాల వాణిజ్య భాగస్వామ్యంలో లెక్కలేనన్ని అవకాశాలను సృష్టించే ట్రేడ్ డీల్కు చర్చలు బాటలు పరుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.