Saturday, February 21, 2026
E-PAPER
Homeజాతీయంప్రజా ప్రయోజనకారిగా మార్చండి

ప్రజా ప్రయోజనకారిగా మార్చండి

- Advertisement -

ఏఐ, డీప్‌టెక్‌ స్టార్టప్‌ల సీఈఓలతో ప్రధాని సమావేశం
న్యూఢిల్లీ :
వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ వంటి వివిధ రంగాల్లో కృత్రిమ మేథస్సు సాంకేతికతను ఉపయోగించడానికి గల అవకాశాలు, మార్గాలపై ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వివిధ ఏఐ, డీప్‌టెక్‌ స్టార్టప్‌ల సీఈఓలతో చర్చించారు. అలాగే మాతృభాషలో ఉన్నత విద్యను పెంపొందించడంతో సహా పలు అంశాలపై మాట్లాడారు. ప్రధానితో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో 16 ఏఐ, డీప్‌టెక్‌ స్టార్టప్‌ల సీఈఓలు, వ్యవస్థాపకులు తమ ఆలోచనలను, చేపట్టిన కార్యకలాపాల గురించి వివరించారు. తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తత పాటిస్తూ బలమైన డేటా వ్యవస్థను రూపొందించాల్సిన ఆవశ్యకతను ప్రధాని నొక్కిచెప్పారు. భారత్‌ అవసరాలకు తగినట్లుగా పరిష్కార మార్గాలను అభివృద్ధి పరచాలని వారిని కోరారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. యూపీఐని చాలా సులభమైన డిజిటల్‌ ఆవిష్కరణగా ప్రస్తావిస్తూ ప్రధాని, దేశీయ ఉత్పత్తుల పట్ల విశ్వాసాన్ని ప్రోత్సహించారు. అదే సమయంలో భారత కంపెనీల పట్ల కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రోదసీ రంగంలో ప్రైవేటు ప్రాతినిధ్యాన్ని విస్తరించడం గురించి కూడా మాట్లాడారు. భారతీయ స్టార్టప్‌లపై పెట్టుబడిదారుల బలమైన ఆసక్తిని గుర్తించారు. వివిధ రంగాల్లో ఎఐ సాంకేతికతను విరివిగా ఉపయోగించుకోవడంతో పాటూ పంటల ఉత్పాదకతను, భూసారాన్ని పరిరక్షించేందుకు ఎరువుల వినియోగాన్ని పర్యవేక్షించాలని అన్నారు. భారతీయ భాషలను, సంస్కృతిని పెంపొందించాల్సిన ప్రాముఖ్యతను ప్రధాని నొక్కి చెప్పారు. మాతృభాషలో ఉన్నత విద్యకు ఏఐ టూల్స్‌ను విస్తరించాలని పిలుపిచ్చారు. సాహసోపేతమైన రిస్క్‌లు తీసుకుంటున్నం దుకు, ప్రభావవంతమైన పరిష్కారాలు రూపొందిస్తున్నందుకు ఆవిష్కర్తలను ఆయన అభినందించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో అధునాతమైన వ్యాధి నిర్ధారక మార్గాల కోసం, జన్యు చికిత్స కోసం, సమర్ధవంతమైన రీతిలో రోగుల రికార్డు నిర్వహణకు, చివరి వరకు నాణ్యతా సంరక్షణకు ఎఐని ఉపయోగించాల న్నారు ఇక వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచడానికి, వాతావరణ సంబంధమైన ముప్పులను ఎదుర్కొనడంలో సాయపడేందుకు ఈ కృత్రిమ మేథను ఉపయోగించుకోవాల న్నారు. అలాగే సైబర్‌ భద్రత, నైతికతతో కూడిన ఎఐ, రోదసీ, న్యాయం, విద్య వంటి వాటిని స్థానిక భాషల్లో పొందడం ద్వారా సామాజిక సాధికారత రంగాలకు స ంబంధించిన ప్రాజెక్టులపై కూడా దృష్టి కేంద్రీకరించింది. సంస్థల ఉత్పాదకతను బలోపేతం చేయడానికి వారసత్వ వ్యవస్థను ఆధునీకరించడంపై కూడా దృష్టి పెట్టింది. ”మొత్తంగా అందరూ కలిసి ఎఐతో కూడిన వినూత్న ఆవిష్కరణల్లో అంతర్జాతీయ నాయకత్వాన్ని నిర్మిస్తూనే స్థానిక అవసరాలను తీర్యే వ్యవస్థను తీసుకురావాలి.” అని నిర్ణయించినట్లు పిఎంఓ ప్రకటన పేర్కొంది. ఎఐని ముందుకు తీసుకెళ్ళడానికి మద్దతుతో కూడిన, ప్రోత్సాహకర వాతావరణాన్ని భారత్‌ అందిస్తోందని స్టార్టప్‌లు పేర్కొన్నాయి. అంతర్జాతీయ ఎఐ తెరపై భారత్‌ తన ఉనికిని ధృఢంగా నిర్ధారిస్తుందని పేర్కొంది.భారత్‌ ఆతిథ్యం ఇచ్చిన ఎఐ ఇంపాక్ట్‌ సదస్సుపై సిఇఓలు అందరూ ప్రశంసలు కురిపించారు. ఎఐ చుట్టూ అంతర్జాతీయంగా చర్చలు జరిగేలా వాతావరణాన్ని సృష్టించడంలో పెరుగుతున్న భారత్‌ హోదాను ఇది ప్రతిబింబించిందని వారు పేర్కొన్నారు.ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి అబ్రిడ్జ్‌, అదాలత్‌ ఎఐ, బ్రెయిన్‌సైట్‌ ఎఐ, క్రెడో ఎఐ, ఏకా కేర్‌, గ్లీన్‌, మైకోచ ఆరిజిన్‌, సూపర్‌నొవా, సైఫా ఎఐ వంటి పలు సంస్థలు సీఈఓలు, వ్యవస్థాపకులు హాజరయ్యారు. ప్రిన్సిపల్‌ కార్యదర్శులు పి.కె.మిశ్రా, శక్తికాంత్‌ దాస్‌, మంత్రి జితిన్‌ ప్రసాద్‌లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -