శిథిలాల కింద పలువురు..!
రాజస్తాన్లో ఘటన
జైపూర్ : పురాతన భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని సుభాష్ చౌక్ ఏరియాలో శనివారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు రెస్క్యూ టీమ్స్తో సహా ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం ఏడుగురు క్షతగాత్రులను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారు. కూలిపోయిన భవనంలో మొత్తం 19 మంది అద్దెకు ఉంటున్నారని స్థానికులు తెలిపారు.
భవనం కూలినప్పుడు అందరూ అందులోనే ఉన్నారా..? ఎవరైనా బయట ఉన్నారా..? అనే వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నట్టు తెలిపారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.