ముగ్గరుకి గాయాలు..కర్నాటకలో దారుణం
మైసూర్ : ఒక కెమికల్ ట్యాంక్ పేలి ఇద్దరు మృతి చెందిన ఘటన కర్నాటకలోని మాండ్య జిల్లాలో ఆదివారం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని కారేకట్టే గ్రామంలో మూడేండ్ల క్రితం మూసివేసిన ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం సంభవించింది. మూసివేసిన ఫ్యాక్టరీ నుంచి యంత్రాలను వేరే ప్రాంతానికి కార్మికులు తరలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకుంది. రసాయనాలతో నిండి ఉన్న ట్యాంక్పై గ్యాస్ కట్టర్ ఉపయోగించినప్పుడు పేలుడు జరిగి ఉండవచ్చనని పోలీసులు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిని వారిని మాండ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన ఇద్దర్నీ బీహార్కు చెందిన ఆకాష్ (26), కల్లుఖాన్ (27)గా గుర్తించారు.
ఈ ఘటన గురించి ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ మూడు సంవత్సరాల క్రితం గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగిన తరువాత నుంచి ఈ ఫ్యాక్టరీని మూసివేసినట్టు చెప్పారు. గ్యాస్ లీకేజీతో సమీప ప్రాంతాలల్లో పంటలు దెబ్బతిన్నాయని, పశువులు మరణించాయని తెలిపారు. అప్పట్నుంచి గ్రామస్తులు ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని, ఫ్యాక్టరీని తిరిగి తెరవడానికి చేసే ఏ చర్యనైనా నిరోధిస్తున్నారని చెప్పారు. ఈ నేపధ్యంలోనే ఉత్తర కర్నాటకలోని మరొక ప్రాంతానికి ఫ్యాక్టరీ యంత్రాలను యాజమాన్యం తరలిస్తున్నట్లు అధికారి తెలిపారు. ఇప్పటికే ఆరు ట్రక్కుల యంత్ర పరికరాలు, సామాగ్రిని ఇక్కడ నుంచి రవాణా చేసినట్టు చెప్పారు. కాగా, ఆదివారం జరిగిన పేలుడుపై బాసరలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
కెమికల్ ట్యాంక్ పేలి ఇద్దరు మృతి
- Advertisement -
- Advertisement -



