కొండకింది గూడెం అనే పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. పాఠశాల మైదానంలో పెద్ద సిలికేరు చెట్టు ఉంది. పిల్లలంతా విరామ సమయంలో చెట్టు మీది కొంగల వలె కనిపించేవారు. ”ఇంటి గంట ఎప్పుడు మోగుతుందా”? అని విద్యార్థులంతా ఎదురుచూసే వారు. గంట మోగింది. సంచులను భుజాలపై వేసుకుని ఇంటి వైపు పరుగందుకున్నారు.
దోస్తులంతా బజార్లో కూర్చుని చూచిరాత రాశారు. లెక్కలు చేశారు. వాకిట్లో అరుగు మీద జాను వాళ్ళ నాయనమ్మ చేతిలో కర్ర పట్టుకొని ఆ పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉంది.
అప్పుడే అటుగా వచ్చిన బొర్రమ్మ బొడ్లె సంచిలోంచి కొన్ని పైసలను తీసింది.
లచ్చమ్మ కొట్టుకాడ చాక్లెట్లను కొన్నది. లెక్కలు చేస్తున్న జానూని పిలిచింది. ”ఏందే!” అనుకుంటూ బొర్రమ్మ వద్దకు వెళ్లాడు.”ఇక్కడే తిను. అక్కడికి పోతే అందరూ అడుగుతారు” అని చాక్లెట్లను ఇచ్చింది.వాటన్నిటినీ నోట్లో పోసుకొని నమిలి మింగి, మూతి తుడుచుకొని దోస్తుల దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే నాటుకు వెళ్లి వచ్చిన కోటమ్మ ”అరే! సామీ.. ఇటు రా” అని పిలిచింది. ”వస్తున్ననే” అనుకుంటూ పరిగెత్తుకెళ్ళాడు. అమ్మమ్మ ఒళ్ళో ఉన్న కందికాయలను పెట్టింది. వాటిని జేబులో పోసుకొని దోస్తుల దగ్గరికి వచ్చాడు. తలా కొన్ని ఇచ్చుకుంటూ ”అరేరు.. మా అమ్మమ్మ తెచ్చింది. మీరంతా నాతోనే తిరగాలి” అనుకుంటూ వాటిని పంచిపెట్టాడు వీరస్వామి.
సంచులను ఇంట్లో పడేశారు. బాగా అరిగిపోయిన పనికిరాని సైకిల్ టైర్లను కష్ణ,పున్నికి ఇచ్చాడు. పొలాలను దున్ని,బాగా అరిగిపోయిన రంధ్రాలు పడిన ట్రాక్టర్ టైర్ ను జాను,వీరు అందుకున్నారు.
ఎడమ చేతి వాటం కలిగిన జాను టైరుకు ఒకవైపు నిల్చుని ఉన్నాడు. మరొకవైపు కుడి చేతివాటం కలిగిన వీరు ఉన్నాడు. మిగతా స్నేహితులకు కొన్ని టైర్లను ఇచ్చాడు వీరు. మట్టిపై కాలుతో గీత గీసి టైర్లతో సిద్ధంగా ఉన్నారు.”ఒకటి,రెండు,మూడు” అని లెక్కపెట్టి చేతులతో టైర్లను బాదుతూ కాలంతో పోటీ పడుతున్నట్లుగా పరుగందుకున్నారు. ఒకరికి ఒకరు తీసిపోనట్లుగా టైర్లను వేగంగా నడుపుతున్నారు. వెనకాలే ”పీప్..పీప్..” అని శబ్దం చేస్తూ ఎర్ర రంగులో ఉన్న బస్సు రావడం గమనించారు.పిల్లలు.అది చూసి మరింత వేగంగా, హుషారుగా ముందుకు సాగారు. అప్పటికే చీకటి పడసాగింది.
భూమి లోపల పాతిన ఇనుప సువ్వలను గమనించాడు వీరు. చేతులను అడ్డంగా ఊపుతూ బస్సు డ్రైవర్ కు సైగ చేశాడు. పిల్లలను గమనించిన డ్రైవర్ బస్సును ఆపాడు. ”ఏమైందిరా బస్సుకు అడ్డంగా నిలుచున్నారు” అని కోపగించుకున్నాడు.”ఇక్కడ ఎవరో భూమిలో సువ్వలను పాతారు” అని చెప్పారు పిల్లలు.వాటిని బయటికి తీశారు. ”చాలా పెద్ద ప్రమాదం నుండి తప్పించారు.లేకుంటే సువ్వలు టైరులో గుచ్చుకొని పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లేది. ఈరోజు మా ప్రాణాలను కాపాడారు”అని పిల్లలను మెచ్చుకున్నాడు డ్రైవర్. మళ్ళీ బస్సు ముందుకు కదిలింది. టైర్లను తోలుతూ చాలా దూరం వచ్చిన పిల్లలు, ఇంటి ముఖం పట్టారు. వారిని కాపలా కాస్తూ చందమామ పిల్లలతో పాటూ పరుగెత్తసాగింది.
ముక్కామల జానకిరామ్, 6305393291



