స్వాగతం పలికిన మోడీ
న్యూఢిల్లీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్ పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ప్రధాని మోడీ స్వయంగా స్వాగతం పలికారు. కరచాలనం చేసి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. అయితే, విదేశాంగ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. అల్ నహ్యాన్ కేవలం రెండు గంటలే ఢిల్లీలో ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాధినేతల భేటీలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారం తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోపక్క ప్రధాని మోడీ… ”సోదరుడు, యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్కు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లాను. ఇరుదేశాల మధ్య స్నేహానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఈ పర్యటన చాటుతోంది” అని ట్వీట్ చేశారు. ఇరాన్- అమెరికా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతినడం, యెమెన్ విషయంలో సౌదీ అరేబియా, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు, గాజాలో రాజకీయ అస్థిరతలు నెలకొన్నవేళ ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. యూఏఈ అధ్యక్ష హోదాలో అల్ నహ్యాన్ భారత్లో అధికారికంగా పర్యటించడం ఇది మూడోసారి. 2022లో ఇరుదేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అనంతరం సంబంధాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది.
భారత్కు యూఏఈ అధ్యక్షుడు
- Advertisement -
- Advertisement -



