– చైన్ స్నాచింగ్ చేసి పట్టుబడిన వైనం
నవతెలంగాణ- జూబ్లీహిల్స్/ అమీర్పేట
భర్త చేసిన అప్పులు తీర్చే మార్గం తెలియక ఓ మహిళ దొంగతనానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. సనత్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన రాజేశ్ వరంగల్కు చెందిన అనితారెడ్డిని రెండేండ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె ఉంది. అనితారెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా ఇటీవల ఉద్యోగం కోల్పోయింది. భర్తకు వచ్చే వేతనం కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో.. రాజేశ్ సుమారు రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. దాంతో ఆ అప్పులు ఎలాగైనా తీర్చాలనే ఉద్దేశంతో అతని భార్య దొంగతనం చేయాలనుకుంది. ఇదిలా ఉండగా బుధవారం మియాపూర్కు చెందిన నల్ల కమల సనత్నగర్లోని తన ఇంటి కిరాయి వసూలు కోసం ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో పైకి వెళ్తున్నది. ఈ క్రమంలో వెనుక నుంచి అనితా రెడ్డి ఆమె మెడలోని అర తులం బంగారు నల్లపూసల గొలుసును లాగింది. అప్రమత్తమైన బాధితురాలు కేకలు వేయడంతో అనిత గొలుసుతో అక్కడి నుంచి పరారైంది. వెంటనే బాధితురాలు సనత్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అపార్ట్మెంట్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా నిందితురాలు సమీపంలోని ఓ ఇంటికి వెళ్లినట్టు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అరగంటలోనే నిందితురాలిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఆమె గతంలో ఎలాంటి నేరాలకూ పాల్పడలేదని, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తొలిసారిగా ఇలా చేసినట్టు నిర్ధారణయింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సనత్నగర్ సీఐ శ్రీనివాసులు తెలిపారు.
భర్త అప్పులు తీర్చే మార్గం లేక దొంగగా మారిన భార్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



