నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
మా అభ్యర్థిని భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి 10వ వార్డులో ఏకగ్రీవం చేయడం దారుణమని మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. పదో వార్డు ఏకగ్రీవంపై యాదగిరిగుట్ట పట్టణంలో నిరసన చేపట్టారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం నుండి పాదాల మీదుగా గాంధీ నగర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, సాయంత్రం 4.30 తర్వాత కూడా ప్రలోభాలకు గురి చేశారని మా దగ్గర అన్ని ఆధారాలున్నాయన్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ కాకుండా అడ్డుకోవాల్సిన అధికారులు స్థానిక ఎమ్మెల్యేకు వత్తాలు పలుకుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ఇమ్మిడి రాంరెడ్డి, కవిడే మహేందర్, పాపట్ల నరహరి, తోటకూరి బీరయ్య, సయ్యద్ బాబా, కోల వెంకటేష్ పలువురు నేతలు, కార్యకర్తలు ఉన్నారు.



