ఎమర్జెన్సీ యాభయ్యవ వార్షికంపై జాతీయ స్థానిక పత్రికలు, ఛానళ్లలో వ్యాసాలు, వ్యాఖ్యలు ముంచెత్తుతున్నాయి. అయితే అదేదో గడిచిపోయిన గండం లాగా చెప్పుకుని, అప్పటి పాలక వర్గ నేతలను చేతలను విమర్శించి, వర్తమానాన్ని విస్మరిస్తే అంతకన్నా పొరపాటు మరొకటి ఉండదు. ఎమర్జెన్సీ లేదా అత్య వసర పరిస్థితి యాభయ్యేండ్ల పూర్తిని గుర్తు చేసుకోవడానికి రెండు బలమైన కారణాలు కనిపిస్తాయి.మొదటిది- స్వతంత్ర భారత చరిత్రలో ప్రజాస్వామ్యంపై తొలి అతి పెద్దదాడి అదే గనక.రెండవది- ఎమర్జెన్సీ విధించిన ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత అతి శక్తివంతుడుగా, ఇంకా బలిష్టుడుగా కీర్తనలందుకునే మోడీ ప్రస్తుత ప్రధానిగా వున్నారు గనక.ప్రతి చారిత్రిక ఘట్టం, కీలక పాత్రధారులు రెండుసార్లు ప్రత్యక్షమవుతారన్న హెగెల్ మాటను కాస్త సవరిస్తూ ”చరిత్ర పునరావృత మవుతుంది, మొదటిసారి విషాదాంతంగా రెండవసారి బూటకంగా” అంటాడు మార్క్స్. ”చరిత్రను మర్చిపోయేవారు దాన్నే పునరావృతం చేసి బలికాకతప్పదు” అంటాడు స్పానిష్ అమెరికన్ రచయిత జార్జిశాంటియానా. అయితే మోడియాగా పేరు మోస్తున్న బడా మీడియాలో మార్మోగుతున్న ఎమర్జెన్సీ చర్చలో అత్యధిక భాగం అందుకు భిన్నంగా ఉండటంలో ఆశ్చర్యమేముంది?
ఎమర్జెన్సీ యాభై ఏండ్లు అన్నప్పుడు ఇందులో తాజా భాగమైన గత పదేండ్ల పైబడిన మోడీ రాజ్ గురించి తులనాత్మక ప్రస్తావన రావ టం లేదు. రాకపోవడం యాదచ్ఛికం కూడా కాదు. అసలు ఈ తతంగాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నదీ, నియ ంత్రిస్తున్నదీ మోడీ రాజ్ అయినప్పుడు అంతకన్నా భిన్నంగా ఎలా వుంటుంది? ఎమర్జెన్సీ నేపథ్యం అమలు అనుభవాలపై చాలా వివరాలొచ్చాయి కనుక పునశ్చరణ అనవసరం. సరిగ్గా ఈ సందర్భంగానే ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హౌసబలే రాజ్యాంగ పీఠిక నుంచి లౌకికతత్వం, సామ్యవాదం అనే పదాలను తొలగించాలని మరోసారి ప్రతిపాదించటంచూస్తే ప్రస్తుత తతంగం ఉద్దేశమేమిటో ఇట్టే తెలిసిపోతుంది. ఎమర్జెన్సీ నిస్సందేహంగా ప్రజాస్వామ్యానికి ఒక పీడకల. అది గతానికి సంబంధించిన చర్చగా మారిపోతే అప్పుడు ప్రయోజనం ఉండదు. దానికి ముందు, తర్వాత జరిగిన, జరుగుతున్న పరిణామాలను కూడా సవ్యంగా గ్రహిస్తేనే ఈ చర్చ ప్రయోజనం నెరవేరుతుంది.
నాడు ఇందిరాగాంధీ నిరంకుశ పోకడలు, ఎమర్జెన్సీ పేరిట పౌర హక్కులపైదాడి, నిర్బంధకాండ ఇవన్నీ తప్పక చెప్పుకోవాల్సిందే. బీహార్లో జయప్రకాష్ నారాయణ్ ఉద్యమం, ఇందిరాగాంధీ ఎన్నిక రద్దు, ఈ రెండు అంశాలను ప్రస్తావించిన తర్వాత అరెస్టుల పర్వానికి రావడం మీడియాలో ఎక్కువమంది చేస్తున్నారు. ఆరెస్సెస్, జన సంఫ్ు, అలాగే స్వతంత్ర పార్టీ వంటి మితవాద రాజకీయ నేపథ్యం గల నాయకులతో పాటు అప్పటి నక్సలైట్ కార్యకర్తల అరెస్టుల కథనాలూ, జ్ఞాపకాలూ దర్శనమిస్తున్నాయి.
మిస్సింగ్ లింక్స్
కానీ వీరంతా దాటేస్తున్న కీలకమైన మిస్సింగ్ లింక్స్ ఏమిటి? శ్రీమతి ఇందిరాగాంధీ నిర్ణయంతో 352వ అధికరణం కింద రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్, 1975 జూన్ 25 అర్ధరాత్రి అత్యవసర పరిస్థితి ప్రక టిస్తే జూలై 21న లోక్సభలో దాన్ని చట్టబద్ధం చేస్తూ తీర్మానం తీసుకొచ్చారు. ఆ చర్చ ప్రారంభించింది, తీవ్ర నిరసనలతో అత్యవసర పరిస్థితిని సభలో మొదట ఎండగట్టింది సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యుడు ఏకే గోపా లన్. ఆయన ప్రసంగం సైక్లోస్టయిల్ కాపీ. అప్పుడు అజ్ఞాతంలో వున్నవారు కూడా గొప్ప ప్రేరణగా భావించారు, ఈ మాట కూడా కొంతమంది రాశారు. కానీ గోపాలన్ నాటి సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అన్న ప్రస్తావనే రావడం లేదు. 1971లో కూడా ఇందిరా గాలిని తట్టుకుని నిలబడిన ఏకైక పార్టీ సీపీఐ (ఎం). 1971లోనే లోక్సభలో సీపీఐ(ఎం)కు 25 స్థానాలు ఉంటే జనసంఫ్ుకు వాజ్పేయితో సహా 11 స్థానాలు ఉన్నాయి. గత రెండు రోజులుగా ‘నవతెలంగాణ’ వ్యాసాల్లో రాసినట్టు 1972 పశ్చిమ బెంగాల్ ఎన్నికల రిగ్గింగ్ నిరంకుశ పాలనకు సంకేతమని సీపీఐ(ఎం) ఇచ్చిన హెచ్చరిక కొంతవరకూ జయప్రకాశ్ నారాయణ్ తప్ప మరే పాలక పార్టీ చెవికెక్కించుకోలేదు
. ఆ పర్యవసానాలను దేశం ఎమర్జెన్సీ రూపంలో అనుభవించాల్సి వచ్చింది. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా బడాపత్రికలు, లౌకిక పాలక పార్టీల నేతలు నాటి పరిణామాల్లో ప్రధాన వామపక్షమైన సీపీఐ(ఎం) పాత్రను విస్మరించటం గమనించదగింది. ఎమర్జెన్సీ కాలంలో సీపీఐ(ఎం) కీలక శక్తిగా ఉన్నచోట్ల సమరశీల కార్యకర్తల్ని దొరికిన మేరకు పోలీసులు అరెస్టు చేశారు. కాకపోతే తనది అభివద్ధి నిరోధక ఫాసిస్టు శక్తులపై పోరాటమని చెప్పుకోవడం కోసం ఇందిరా గాంధీ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అంతమాత్రాన శ్రీమతి ఇందిరాగాంధీని, నిరంకుశత్వాన్ని తానే ఓడించినట్టుగా ఆరెస్సెస్, బీజేపీలు ఊరేగడం చెల్లుబాటయ్యేది కాదు. ఆరెస్సెస్ కీలక నేత బాలసాహెబ్ దేవరస్ ప్రధానికి జైలు నుంచి లేఖలు రాసి మద్దతు ప్రకటించినప్పటికీ, ఆ లేఖలు పరిణామాలు విస్తారంగా అందుబాటులో ఉన్నప్పటికీ, బడా మీడియా వాటిని ఎందుకు పముఖంగా చర్చకు పెట్టడం లేదు? అప్పట్లో ఆరెస్సెస్్ ప్రచారక్గా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ మారువేషాలు కథలతో తెచ్చిన పుస్తకాలకు పెద్ద ప్రచారం వస్తున్నదే కానీ సీపీఐ(ఎం), ప్రజా సంఘాలు క్రమపద్ధతిలో ఆ నిరంకుశత్వంపై చేసిన పోరాటాలు ఉద్యమాలు తెచ్చిన సాహిత్యం గురించి చెప్పడం లేదే? ప్రజాశక్తి వారపత్రికగా అప్పట్లో నిర్వహించిన రాజకీయ పాత్ర అమోఘమైంది. ప్రభుత్వాన్ని పొగిడేందుకై వచ్చే కథనాలనే వ్యంగ్య శీర్షికలతో ఇచ్చేది. మోటూరు హనుమంతరావు అంజి పేరుతో ఆ రోజుల్లో ‘రాజువెడలె’ అంటూ సంజరుగాంధీ ఆర్భా టంపై రాసిన వ్యంగ్య రచన ఎంతో ఆకర్షించింది. అదే తరహాలో వడ్లమూడి నాగేశ్వరరావు ‘రావేరావే రంగీ’ పేరిట నృత్యనాటిక రాస్తే ఎమర్జెన్సీలోనే 1976 మేలో విజయవాడలో ప్రజా నాట్యమండలి పునరుద్దరణ సద స్సులో ప్రదర్శించడం ఇంకా గుర్తుంది. ప్రజాశక్తి సెన్సార్ ఆంక్షలను కూడా తట్టుకుని వ్యంగ్య రూపంలో చాక చక్యంగా విలువైన సమాచారాలిస్తూ నిజంగానే ఒక కరదీపికగా పనిచేసింది. ప్రజాస్వామ్యం కోసం పోరాటంలో ప్రజాశక్తి, ప్రజాకళలు ఆ విధంగా గొప్ప పాత్ర వహించాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇలా చెప్పుకోవలసిన విశేషాలు మరిన్ని వున్నాయి. మరోవైపున ఆరెస్సెస్ మాత్రం ఇందిరాగాంధీని మంచి చేసుకునేందుకు తంటాలు పడుతూ వచ్చింది. వాజ్పేయి పెరోల్పై విడుదలై బయటే ఉండిపోయారు. ఆ ముచ్చటలేమైనా చర్చకు వస్తున్నాయా?
వ్యక్తిగత అంశాల్లోనూ వేట
ఇవన్నీ గతానికి సంబంధించినవి అనుకుంటే, ఇప్పుడు జరుగుతున్న తీవ్ర పరిణామాలైన మాట్లాడుతున్నదా బడా మీడియా? పత్రికలపై నాటి సెన్సార్ , పౌర హక్కుల సస్పెన్షన్ ఘోరమైనవే కానీ ఇప్పుడు కూడా డజన్లమంది జర్నలిస్టుల పైన దాడులు, మూసివేతలు, అరెస్టులు లేవా? అప్పుడు నిర్బంధానికి గురై, ఇప్పటికీ వారి వెంట పడుతున్న ప్రబీర్ పురకాయస్థ లాంటి వాళ్లను ఎందుకు ముందుకు తేవడం లేదు? అప్రకటిత ఎమర్జెన్సీ అని అంటున్నప్పుడు అదశ్య ప్రభావాలు ఏమిటో తెలుసుకుంటే ఈ ప్రశ్నలకు సమాధానం సులభంగా దొరుకుతుంది. ఉద్దేశం ఏదైనా ఏదో ఒక రాజ్యాంగ నిబంధన మేరకు విధించబడి ముందో వెనకో సభలో చర్చకు వచ్చింది ఎమర్జెన్సీ. నిరంకుశధోరణిలో వచ్చిన 42వ రాజ్యాంగ సవరణ చర్చనూ సీపీఐ(ఎం) దేశవ్యాపితంగా నిర్వహించింది. పుస్తకాలు వేసింది. 1977లో ప్రజలు శ్రీమతి ఇందిరా గాంధీని ఓడించాక అవన్నీ వెనక్కు కొట్టగలిగారు. కానీ ఇప్పుడు పెద్దనోట్ల రద్దు నుంచి లోక్సభ ప్రమేయం లేకుండానే జరిగి పోయాయి. పౌరసత్వ సవరణ, కాశ్మీర్ 370తో సహా అతి కీలకమైన విధాన నిర్ణయాలు సమగ్రంగా చర్చకు పెట్టింది లేదు. ఇటీవల పాకిస్తాన్తో సాగిన సాయుధ ఘర్షణకు సంబంధించిన నిజానిజాలను, తప్పొప్పులను మాట్లాడుకోవడానికి పార్లమెంట్ సమావేశాలు జరపాలన్నా ఏకపక్షంగా నిరాకరణే ఎదురైంది. అప్పట్లో అనేకచోట్ల నిర్బంధ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరగడం ఘోరమే. కానీ, ఇప్పుడు ఇండ్లలో ప్రజలు ఏమి తిం టున్నారు,వారి వంటింట్లో ఉన్న ఆహారపదార్థాలు ఏమిటి, మహిళలు ఏ వస్త్రాలు ధరిస్తున్నారు? ఏ వాహనంలో ఏ జంతువులను తరలిస్తున్నారన్నది పోలీసులను మించి సంఫ్ు పరివారం మనుషులే వేటాడి దాడులు చేస్తున్నారు.ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన విషాదాలు ఎన్నెన్నో. ఆనాడు ఒక వ్యక్తి అధికారపరమైన రాజకీయ నిరంకుశత్వం సాగిన దాన్ని మించి ఇప్పుడు పౌరుల వ్యక్తిగత జీవిత పరిధిలోకి కూడా ఎమర్జెన్సీ ప్రవేశించటం వీటిలో స్పష్టం. ఎమర్జెన్సీలో నిరంకుశత్వం మతాలవారీగా జరిగినట్టు పెద్దగా దాఖలాలు లేవు. కానీ, ప్రస్తుత అప్రకటిత పర్వంలో ఒక మతాన్ని, అణగారిన వర్గాలను, స్వతంత్ర భావాలు గల రచయితలను వెంటాడటం పరిపాటి అయింది. ఇందుకు కారణం దీనికి ఒక మతతత్వ నిరంకుశ భావజాలం ఉండటమే. కిస్సా కుర్సీకా వంటి చిత్రాలను ఎమర్జెన్సీలో ఆటంకపరిచారు. కానీ, ఇప్పుడు అసలు షూటింగులు మొదలవకముందు నుంచే వాటిపై దాడులు, దౌర్జన్యాలు సర్వసాధారణమైపోయాయి.
వ్యవస్థీకృత ప్రమాదం
తనను తాను ప్రగతిశీల వాదిగా చూపించుకోవడం కోసం అప్పట్లో శ్రీమతి గాంధీ కొన్ని పరిశ్రమల స్థాపన, జాతీయకరణ వంటి నిర్ణయాలు చేస్తే, ఇప్పుడు ఇష్టానుసారం కార్పొరేట్లకు కట్టబెట్టడం చట్టబద్ధంగానే జరిగిపోతుంది. కరోనాపై పోరాటం లాంటి ఆరోగ్య అంశాల నుంచి అందరూ ఆలోచించే విదేశాంగ విధానం వరకు ఒక వ్యక్తి చుట్టూనే తిరుగుతున్న పరిస్థితి. ఇందిరే ఇండియా అనడం ఎంత తప్పో ఇప్పటికీ చెబుతు న్నాము. కానీ, విశ్వగురు బిరుదు తీసుకుని ప్రపంచానికే మా నేత మార్గదర్శకుడని టముకు వేయడాన్ని ఏమనాలి?గాంధీ కుటుంబాన్ని దర్యాప్తు చేసిన అధికారులను వేధించినట్టు ఎమర్జెన్సీపై నియమితమైన షా కమిషన్ ముందు కేసులు వచ్చాయి. కానీ ఇప్పుడు తమకు నచ్చని ముఖ్యమంత్రులు, కీలక నేతలను త్రిశూల వ్యూహంతో వేటాడటాన్ని చాలాసార్లు న్యాయస్థానాలే కొంతవరకు తప్పుపట్టిన పరిస్థితి. అందువల్ల శ్రీమతి గాంధీ పదవి కాపాడుకోవడం కోసం తెచ్చిన ఎమర్జెన్సీ వ్యక్తిగత స్థాయిలో ఆంతరంగిక ముఠాతో నడిచింది. కానీ ఇప్పుడు కార్పొరేట్ వర్గాలు, మతతత్వ సంస్థలు, అంతర్జాతీయ ద్రవ్య అధిపతుల కీలుబొమ్మలైన ట్రంప్ వంటివారితో సహా కలగలసి, వ్యవస్థీకత నిరంకుశత్వంగా మోడీ రాజ్ అన్ని విభాగాలనూ, జీవన రంగాలనూ మనుధర్మం మార్కెట్ మర్మాలతో శాసించేందుకు చెలరేగి పోతున్నది. ఇంత మీడియా, ఇంత అక్షరాస్యతలేని రోజుల్లోనే ఎమర్జెన్సీని ఓడించిన భారతీయ ఓటర్లు ఈ వ్యవస్థీకృత సనాతనాన్ని కూడా ఎల్లకాలం సహిస్తారను కోవడం పొరబాటు. 2024 ఎన్నికల్లోనే ప్రజలు బీజేపీకి స్వంతంగా మెజార్టీ ఇవ్వలేేదని గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్తో సహా వివిధ పాలక వర్గ పార్టీలలో అనిశ్చిత వైఖరి, అనేక ప్రాంతీయ పార్టీల అవకాశవాద ధోరణులు మారి లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకోసం వస్తే ‘అప్రకటిత’ ప్రమాదాన్ని ప్రతిఘటించడం సాధ్యమే.
తెలకపల్లి రవి