Saturday, May 17, 2025
Homeప్రధాన వార్తలుఫ్యూచర్‌ సిటీలో భూగర్భ విద్యుత్‌లైన్లు

ఫ్యూచర్‌ సిటీలో భూగర్భ విద్యుత్‌లైన్లు

- Advertisement -

– మూడేండ్ల విద్యుత్‌ ప్రణాళికలు సిద్ధం చేయండి
– ఎక్కడా కరెంటు పోల్స్‌, లైన్లు కనిపించొద్దు
– అక్కడి హెచ్‌టీ లైన్లను తరలించాలి
– ఓఆర్‌ఆర్‌ చుట్టూ సోలార్‌ విద్యుత్‌కు ప్రణాళికలు : విద్యుత్‌ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా వచ్చే మూడేండ్ల కాలానికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో విద్యుత్‌శాఖపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్‌ శాఖల మంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ కృష్ణభాస్కర్‌, టీజీఎస్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ ముషారఫ్‌ అలీ, టీజీ రెడ్కో ఎమ్‌డీ వీ అనీల తదితరులు పాల్గొన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్డు (త్రిబుల్‌ ఆర్‌) వరకు రేడియల్‌ రోడ్లు, శాటిలైట్‌ టౌన్‌షిప్‌లకు కావాల్సిన విద్యుత్‌ అవసరాల కోసం హెచ్‌ఎమ్‌డీఏతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా సబ్‌స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలనీ, లైన్ల ఆధునీకరణపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఫ్యూచర్‌సిటీలో పూర్తిగా భూగర్భ విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అక్కడ ఎలాంటి విద్యుత్‌ టవర్లు, పోల్స్‌, లైన్లు బహిరంగంగా కనిపించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అక్కడి హై టెన్షన్‌ లైన్లను కూడా తరలించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో స్మార్ట్‌ పోల్స్‌ ఏర్పాట్లను ప్రయోగాత్మకంగా సెక్రటేరియట్‌, నెక్లెస్‌ రోడ్‌, కేబీఆర్‌ పార్కు వంటి ప్రాంతాల్లో చేపట్టాలని చెప్పారు. 160 కిలో మీటర్ల అవుటర్‌ రింగ్‌ రోడ్‌ పొడవునా సోలార్‌ విద్యుత్‌ వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలనీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎమ్‌సీ) పరిధిలోని ఫుట్‌పాత్‌లు, నాలాల్లో సోలార్‌ విద్యుదుత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలోకి నూతన పరిశ్రమలతో పాటు గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, మాస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ (మెట్రో, ఎలక్ట్రికల్‌ వెహికిల్స్‌) వంటివి పెద్ద సంఖ్యలో వస్తున్నందున పునరుత్పాదక ఇంధనంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. దానికోసం రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేసుకోవాలన్నారు. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు విద్యుత్‌ డిమాండ్‌ 9.8 శాతం పెరిగిందనీ, అయినా నాణ్యమైన నిరంతర విద్యుత్‌ సరఫరాను చేయగలుగుతు న్నామని తెలిపారు. ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్ల పీక్‌్‌ డిమాండ్‌ నమోదైందనీ, 2025-26లో 18,138 మెగావాట్లు, 2034-35 నాటికి 31,808 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదవుతుందనే అంచనా ఉన్నందున దానికి తగినట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.క్లీన్‌ ఎనర్జీ, పంప్డ్‌ స్టోరేజ్‌, ప్లోటింగ్‌ సోలార్‌ విద్యుదుత్పత్తి అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీని అమల్లోకి తేవాలనీ, దానికోసం విద్యుదుత్పత్తిలో ప్రఖ్యాతిగాంచిన ప్రపంచ దిగ్గజ సంస్థలకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టులు, మెట్రోరైల్‌ విస్తరణ, రైల్వేలైన్లు, ఇతర మాస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ల విద్యుత్‌ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -