కేసీఆర్ చెప్పిందే..కిషన్రెడ్డి చేస్తున్నారు
కాళేశ్వరంపై రెండ్రోజుల్లో ‘న్యాయ కమిషన్’ ముందు చెప్తా
కేసీఆర్ ఫ్యామిలీవి ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాలోని పాత్రలు
నక్సలిజానికి అంతం లేదు…అదొక ఫిలాసఫీ
కర్నాటకలో తెలంగాణ కులగణన మోడల్ అమలు : మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రతి ప్రాజెక్ట్ను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ఏం చెబుతారో, కిషన్రెడ్డి అదే అమలు చేస్తున్నారని అన్నారు. కిషన్ రెడ్డి, కేసీఆర్ను వేరేలా చూడలేమని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డిని కలిసినట్టు చెప్పారు. కానీ… తెలంగాణ నుంచి క్యాబినెట్ మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి ఏనాడైనా రాష్ట్ర అభివృద్ధి అంశాలపై రివ్యూ చేపట్టారా? అని ప్రశ్నించారు. ఆయన రాష్ట్ర ప్రాజెక్ట్లను ప్రతిపాది ంచకపోవడం వల్లే ఏ ప్రాజెక్ట్ రావడం లేదన్నారు. క్యాబినెట్ కన్నా ముందు కనీసం ప్రధాని మోడీ దగ్గరైనా తెలంగాణ అంశాలను లేవనెత్తారా? అని అడిగారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగింపునకు ముందు సీఎం రేవంత్రెడ్డి తుగ్లక్రోడ్లోని తన అధికారిక నివాసంలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. చెన్నైకి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, బెంగళూరుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిలు మెట్రోరైళ్లను తీసుకెళ్లారని గుర్తు చేశారు. మరి తెలంగాణకు కిషన్రెడ్డి ఎందుకు మెట్రోరైల్ విస్తరణ అనుమతులు తీసుకురాలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వ్యతిరేకిస్తున్నందుకే, కిషన్రెడ్డి మెట్రోరైల్ తీసుకెళ్లడం లేదని ఆరోపించారు. వరదలు వస్తే రూపాయి కూడా తేలేదని, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్, ట్రిపుల్ ఆర్ ఇలా ఏదీ తేలేదన్నారు. అయితే దేవుడిచ్చే వాటికి తానే యజమాని అన్నట్టు.. ప్రాసెస్లో భాగంగా వచ్చే వాటిని తానే తెచ్చినట్టు చెప్పుకుంటున్నారని విమర్శించారు. తాను ప్రధానిని కలిస్తే తప్పు పడుతోన్న కిషన్రెడ్డి… తెలంగాణకు సంబంధించిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలతో రాష్ట్ర ప్రాజెక్ట్లపై కిషన్ రెడ్డి ఎందుకు ప్రధానిని కలిసి కోరడం లేదన్నారు. కిషన్ రెడ్డి రివ్యూ చేస్తా అంటే… తెలంగాణ అధికారులందరినీ తీసుకొని ఢిల్లీ వస్తానని సవాల్ విసిరారు. గతంలో ప్రధాని మోడీ తనకు ఇచ్చిన పెండింగ్ ప్రాజెక్ట్ లపై రివ్యూ చేసి అన్నింటినీ పరిష్కరించినట్టు తెలిపారు. ఇందులో బీబీనగర్ ఎయిమ్స్ విషయంలో చాలా వేగంగా స్పందించారని కేంద్ర మంత్రి గడ్కరీ స్వయంగా తనకు ఫోన్ చేసి మెచ్చుకున్నారని చెప్పారు.
హైదరాబాద్ కలెక్టర్ నే స్వయంగా పంపా…
కులగణన కోసం ఎవరూ తన ఇంటికి రాలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీఎం తోసిపుచ్చారు. డోర్ టూ డోర్, టోల్ ఫ్రీ, ఆన్లైన్, ఇతర పద్ధతుల్లో ప్రజలకు ఎన్రోల్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. సర్వే ద్వారా ఫైనల్గా 97 శాతం రికార్డ్స్ సేకరించామన్నారు. కేసీఆర్, కిషన్రెడ్డి, హరీశ్రావు, కేటీఆర్, ఇతర గ్రేటర్ పరిధిలోని ముఖ్యనేతల వివరాలను హైదరాబాద్ కలెక్టర్ నేరుగా వెళ్లి నమోదు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. కానీ…వీరందరూ రాజకీయంగా కులగణన సర్వేకు దూరంగా ఉన్నారని విమర్శిం చారు. నిజంగా కిషన్రెడ్డి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే… కనీసం టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసినా సరిపోయేదన్నారు. డేటా ప్రైవసీ యాక్ట్ ప్రకారం… ఈ సర్వే డేటాను భద్రంగా ఉంచినట్టు చెప్పారు.
కర్నాటకలో తెలంగాణ కులగణన మోడల్ అమలు
కర్నాటకలో తెలంగాణ కులగణన మోడల్ అమలు కోసం ఢిల్లీ వచ్చినట్టు సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. తన దగ్గర ప్రస్తుతం 12 శాఖలు ఉన్నాయని, హైదరాబాద్కు వెళ్లగానే మిగితా మంత్రుల దగ్గర ఉన్న శాఖలపై రివ్యూ నిర్వహిస్తానని తెలిపారు. మొదట తన దగ్గర ఉన్న శాఖలను కొత్త వారికి ఇవ్వాలని యోచిస్తున్నట్టు చెప్పారు. మిగితా మంత్రులు కూడా తమ వద్ద ఉన్న శాఖలతో పని భారంగా ఉందని భావిస్తే… ఎవరికి ఏయే శాఖలు కేటాయించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నోళ్లకు పదవులు దక్కుతాయన్నారు. అయితే తన ఇంట్లో ఎవరూ యాక్టీవ్ పాలిటిక్స్లో లేరని అందుకే ఎవరికీ అవకాశం దక్కలేదన్నారు.
సర్వే ఆధారంగానే… తాజా మంత్రి వర్గ విస్తరణ
రికమెండేషన్ల ప్రకారం క్యాబినెట్ విస్తరణ చేపట్టలేదని… కులసర్వే డేటా ఆధారంగానే ప్రస్తుతం తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ చేసినట్టు సీఎం చెప్పారు. కేసీఆర్ ఆరు నెలలు ఒక్క మంత్రిని నియమించకపోయినా ఎవరూ ప్రశ్నించలేదన్నారు. కానీ…తాము చరిత్రలో తొలిసారి ఎస్సీ, బీసీ వర్గాలకు సామాజిక న్యాయం అందించేలా మంత్రి వర్గ విస్తరణ చేపట్టామని తెలిపారు. మిగిలిన మూడు బెర్త్లను సమయానుగుణంగా భర్తీ చేస్తామని చెప్పారు. అయితే మొత్తం 18 మంది మంత్రి వర్గంలో… కేసీఆర్ ఎనిమిది మంది రెడ్డిలు, నలుగురు వెలమ, ఒక ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులు కట్టబెట్టారన్నారు. కానీ దాదాపు 40 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఒక్కో పదవి ఇచ్చారని విమర్శించారు. తాము మాత్రం సామాజిక న్యాయంలో భాగంగా.. ఒక స్పీకర్, నలుగురు మంత్రులు మొత్తం ఐదుగురు ఎస్సీ వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించామని తెలిపారు. అంటే 18 శాతం ఉన్న ఈ వర్గానికి… మంత్రి వర్గంలో 26 శాతం ప్రయార్టీ ఇచ్చామని తెలిపారు.
విపక్షాల మైండ్ గేమ్లో పడొద్దు
తమది రేర్ (ఆర్ఏ ఆర్ఈ) కాంబినేషన్ అని సీఎం రేవంత్ చెప్పారు. రేర్ అంటే రాహుల్- రేవంత్ అని అభివర్ణించారు. ఢిల్లీ పర్యటనలో అగ్రనేతలు రాహుల్, ఖర్గేలతో పార్టీ అంతర్గత అంశాలపై చర్చించినట్టు తెలిపారు. ‘పార్టీ అపాయింట్ చేస్తేనే ప్రభుత్వం అవుతుంది. మాది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నేతత్వంలో కొనసాగుతోన్న సర్కార్. అలాంటప్పుడు రాష్ట్ర ఇన్చార్జి, పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎంలు లేకుండా క్యాబినెట్పై ఎలా చర్చిస్తాం. ఇదంతా విపక్షాలు ఆడుతోన్న మైండ్ గేమ్’ అని విమర్శించారు. ఆ విపక్షాల మాయలో పడొద్దని ప్రజలకు సూచించారు. కర్ణాటకలో అమలు చేయాల్సిన కుల గణనకు… తెలంగాణ సక్సెస్ మోడల్ను ఎలా వాడుకోవాలనే దానిపై అధిష్టానం పెద్దలతో చర్చ జరిగిందన్నారు. తెలంగాణ కుల గణన మోడల్ను యాజ్ టీజ్గా కర్ణాటకలో ఇప్లిమెంట్ చేయాలని హైకమాండ్ ఆలోచిస్తోందన్నారు. అందులో భాగంగా ఆ రాష్ట్ర సీఎం సిద్ధ రామయ్య, తనను పిలిచి… కులగణనపై వివరించాలని అధిష్టానం సమావేశం నిర్వహించిందన్నారు. తెలంగాణ సర్కార్ చేపట్టిన సర్వేలో కులం అనేది ఒక అంశం మాత్రమే కాదని… 360 డిగ్రీల్లో సోషల్, ఎడ్యూకేషన్, ఎంప్లాయిమెంట్, కుల, రాజకీయ అంశాల వారీగా చేసిన సర్వేగా అభివర్ణించారు. దీని ద్వారా వార్డ్ మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు ఏయే పదవులకు ఏ కులం, ఏ పార్టీ… రిజర్వేషన్, జనరల్ కోటాలో ఎన్నిసార్లు అవకాశం పొందిందో వ్యక్తిగత డేటాను క్రోడికరించినట్టు తెలిపారు.
కాంగ్రెస్లోకి కేసీఆర్ ఫ్యామిలీకి నో ఎంట్రీ…
రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కుటుంబానికి చోటు లేదని(జబ్ తక్ రేవంత్ రెడ్డి హై… కబ్ తక్ కేసీఆర్ పరివార్ కోస కాంగ్రెస్ పే జాగా నహీహై) సీఎం అన్నారు. తెలంగాణకు కేసీఆర్, ఆయన కుటుంబం దుష్మన్ అని అన్నారు. ఈ దుష్మన్ పరివార్కు కాంగ్రెస్ పార్టీలో జాగా లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షా ఆరోపించారని గుర్తు చేశారు. ఇదే నిజమైతే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతం అని ఎలా చెప్తారని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ కామెంట్స్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా సమర్థించారన్నారు.
కేసీఆర్ ఫ్యామిలీది సెల్ఫ్ క్రియేషన్…
ప్రజల్లో బీఆర్ఎస్, కల్వకుంట్ల ఫ్యామిలీపై చర్చ లేనప్పుడు… అందరి అటెన్షన్ పొందేందుకు ఆ కుటుంబం సెల్ప్ క్రియేషన్ చేస్తోందని సీఎం విమర్శించారు. ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాలో దొంగతనం చేసేందుకు వీలుగా ఉండే భాషా క్యారెక్టర్లా… కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్రావులు పాత్రలు పోషిస్తున్నారన్నారు. అమాయకుడిని టార్గెట్ చేసి తమలో తాము కొట్టుకుంటున్నట్టు భాషా క్యారెక్టర్తో పలువురు ఉంటారన్నారు. అలాగే బీఆర్ఎస్లో ఈ ఫ్యామిలీ సైతం తమలో తాము గొడవ పెట్టుకొని… పొద్దుగాల చర్చకు తెరలేపిందని విమర్శించారు. ఫైనల్గా అందరూ కలిసి కాళేశ్వరం కమిషనర్ దగ్గరకు పోయి ఆందోళన చేస్తోన్నారని ఎద్దేవా చేశారు. అంటే ఇంత కాలం కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న కవిత… మరి ప్రస్తుతం తాను కూడా దయ్యం అయ్యారా? అనేది చెప్పాలన్నారు. తాను ముందు నుంచి కేసీఆర్ ఫ్యామిలీనే కొరివి దెయ్యాలని చెబుతున్నట్లు గుర్తు చేశారు. 18 నెలల్లో బీఆర్ఎస్పై ఎప్పుడూ తాము కక్షపూరిత రాజకీయాలు చేయలేదన్నారు. అవినీతి ఆరోపణలపై కమిషన్లు వేశామని, ఆ కమిషన్లు తమ పని తాము చేసుకుంటున్నాయని చెప్పారు. కాళేశ్వరంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఘోష్తో కమిషన్ వేశామని వివరించారు.
కేసీఆర్తో పాటు అందరూ కాళేశ్వరం కమిషన్ ముందు తమ అభిప్రాయాలను తెలిపార న్నారు. అయితే తనకు తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజలే కమిషన్ అని, ఆ కమిషన్ ముందు తన అభిప్రాయాలను వివరిస్తానన్నారు. ఈ దిశలో కాళేశ్వరానికి ంబంధించి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ, జ్యుడీషియల్ కమిషన్, విజిలెన్స్ కమిషన్, ఇతర రిపోర్ట్లపై రెండు రోజుల్లో ప్రెస్మీట్తో ప్రజల ముందుకు వస్తానన్నారు.
నక్సలిజానికి అంతం లేదు…
‘నక్సల్ బరి ఖతం అయ్యే ప్రసక్తే లేదు. నక్సలిజం అనేది ఒక ఫిలాసఫీ, లా అండ్ ఆర్డర్ సమస్య కాదు. ఇది పూర్తిగా సోషల్ ఇష్యూ. ఎప్పటి వరకు ప్రజల్లో సోషల్ ఇంట్రెస్ట్ ఉంటుందో, అప్పటి వరకు ఇది వివిధ రూపాల్లో నిక్షిప్తమై ఉంటుంది.’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. 70లో వెస్ట్ బెంగాల్లో నక్సలిజం పుట్టిందని..ఆ దిశలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భూ సంస్కరణలో నక్సలిజం తగ్గిందని గుర్తు చేశారు. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి వచ్చిందని, అప్పుడు ‘దున్నేవాడిదే భూమి’ పేరుతో నక్సలిజాన్ని తగ్గించే ప్రయత్నం చేసిందన్నారు. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకువచ్చి… నిజాం, భూ స్వాముల నుంచి వేలాది భూములను తీసుకొని 25 లక్షల భూములు ఎస్సీలకు, 10 లక్షల భూములను ఆదివాసీలకు కాంగ్రెస్ సర్కార్ పంచిందన్నారు. ఇలా నక్సల్ ఎజెండాను కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందన్నారు.
రాష్ట్రాభివృద్ధికి వందలసార్లైనా ఢిల్లీకి వెళ్తా…
పార్టీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటే అక్కడికి ఆ పార్టీ నాయకత్వం వెళ్తుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మరి ఎర్రవెల్లి ఫాం హౌజ్కు బీఆర్ఎస్ నేతలు గాడిదలు కాసేందుకు వెళ్తున్నారా? అని ప్రశ్నించారు. అప్పుడప్పుడు కేటీఆర్ కూడా ఢిల్లీకి ఎందుకు వస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ అని, పొలిటికల్ క్యాపిటల్ కాదన్నారు. కేంద్ర అనుమతులు, పార్టీ అధిష్టాన నిర్ణయాలపై తాను కచ్చితంగా హస్తినకు వస్తానన్నారు. మెట్రో ఫేజ్ 2 పర్మిషన్, ట్రిపుల్ అనుమతి, రైల్వే లైన్ల కోసం, ఫైనాన్స్ రీ స్ట్రక్చర్, రాష్ట్ర అభివృద్ధి కోసం వందలసార్లైనా ఢిల్లీకి వెళ్లక తప్పదన్నారు. ఏబీవీపీ నుంచి తాను డ్రాప్ అవుట్ స్టూడెంట్ కాదని, ఎలివేట్ స్టూడెంట్ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రమంత్రే అడ్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES